అయితే ఇన్నాళ్లూ.. ఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నటీఆర్ఎస్.. సడెన్ గా రూటు మార్చింది. కొత్త వ్యూహాలతో అడుగులు వేస్తోంది. హుజురాబాద్ లో ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఈటల అవినీతి, వ్యక్తిగత వ్యవహారాన్ని వదిలేసి బీజేపీని పట్టుకుంది. గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయని విమర్శిస్తూ ముందుకెళ్తోంది. బీజేపీ ప్రభుత్వం నూతన సాగు చట్టాలతో రైతుల్ని నిండా ముంచేశారని.. విమర్శలు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు.. దీంతో ఇన్నాళ్లూ ఈటలకు కమలం గుర్తు బలం అని అనుకున్నవారు సైతం.. ఇప్పుడు అదే గుర్తు ఈటలకు ప్రతిబంధకం అవుతుందని చెబుతున్నారు.
రోజు రోజుకీ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల్లో ఇప్పటికే అసహనం పెరిగి పోయింది. ఈ సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ గట్టగానే పనిచేస్తోంది. హుజూరాబాద్ లో జరిగే ఎన్నికలను ఇందుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనివల్లనే ఇప్పటివరకూ ఈటలపై విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్.. తాజాగా రూటు మార్చి.. బీజేపీని టార్గెట్ చేసింది. ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ వ్యూహాలు రచిస్తోంది. ఈటల ఓడిపోతే.. అందుకు బీజేపీనే కారణమని కూడా చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఈటలను సెల్ఫ్ డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.. మరోవైపు ఈటల కూడా ఇన్నాళ్లూ బీజేపీ మాయలో ఉన్నారు. ఆ పార్టీ తనకు అండగా ఉంటుందని అనుకున్నారు. తీరా ఇప్పుడు వారి మాయనుంచి మెల్ల మెల్లగా బయటపడుతున్నారు. తన సొంత బలంతోనే హుజూరాబాద్ లో గెలవాలని అనుకుంటున్నారు.