తనను పీసీసీ ప్రెసిడంట్ చేయడంలో రాహుల్ పాత్ర చాలా కీలకమంటున్న రేవంత్ రెడ్డి.. ఆయన ప్రత్యేకమైన ఆలోచనతో సోనియాగాంధీని ఒప్పించారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితుల్లో బోల్డ్ డెసిషన్ తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ సోనియా గాంధీని ఒప్పించారట. రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా చొరవ చూపడం వల్లే తనకు పీసీసీ పదవి వచ్చిందని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి.. కాంగ్రెస్లోని అగ్ర నాయకత్వాన్నంతా టీఆర్ఎస్కు తీసుకెళ్లడంతో ఖాళీ ఏర్పడిందని రేవంత్ అన్నారు.
కాంగ్రెస్లోని సీనయర్లనందరినీ టీఆర్ఎస్కు తీసుకెళ్లడం ద్వారా తనకు కేసీఆర్ పీసీసీ అవకాశం వచ్చేందుకు పరోక్షంగా కారణమయ్యాడని రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రశ్నించేవారే ఉండొద్దన్న కేసీఆర్ పట్టుదల, కుతంత్రం కారణంగా తనకు అవకాశం వచ్చిందని.. రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ తనపై కసితో వ్యవహరించి, ఇంట్లో పడుకున్నా లాక్కెళ్లి బజారున పడేశారని.. అకారణంగా జైల్లో పెట్టించి, రోడ్లమీద పడేశారని.. తనపై 108 కేసులు పెట్టించారని.. వీటి వల్లే తనకు నాయకుడిగా గుర్తింపు వచ్చిందని రేవంత్ రెడ్డి అంటున్నారు.
ఇప్పుడు తన వల్లే రేవంత్ వచ్చాడని కేసీఆర్ రోజూ బాధపడే రోజు వచ్చిందని రేవంత్ అంటున్నారు. తాను చేసిన తప్పులకు ఇప్పుడు ఆయనకు ఆయనే చెంపలు వేసుకోవాల్సి ఉంటుందంటున్నారు రేవంత్ రెడ్డి.