హుజురాబాద్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పార్టీలో గుర్తింపు పొందిన నాయకులు ఎందుకు కనిపించడం లేదు? వారు అలిగారా లేక ప్రచారంలో వారి అవసరం లేదని పార్టీ భావించిందా? బిజెపిలో కీలకంగా ఉన్న నాయకుల పై జరుగుతున్న చర్చ ఏంటి? హుజురాబాద్ ఎన్నికల ప్రచారం రంజుగా సాగుతోంది.నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాషాయ దండు అక్కడికి షిఫ్ట్ అయింది. ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్నారు. చిన్న సభలు,సమావేశాల్లో పాల్గొని కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఇలా వచ్చి అలా ప్రచారం చేసి వెళ్లినట్టు కాకుండా, ప్రచారానికి ఎక్కువ సమయమే కేటాయిస్తున్నారు నాయకులు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్ష రాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితురాలు విజయశాంతి, బిజెపి స్టార్ క్యాంపెనర్ జాబితా లో ఉన్నటువంటి నేతలు అక్కడ ప్రచారంలో ఉన్నారు. బిజెపి తరఫున ఎంతమంది ప్రచారం చేస్తున్నా పార్టీలో కీలకంగా ఉన్న ఒకరిద్దరు నాయకులు మాత్రం కనిపించడం లేదు. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ జాడలేదు. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు, జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాజాసింగ్. హుజురాబాద్ కు దూరంగా ఉండిపోయారు. స్టార్ కంపెనర్ జాబితాలో రాజాసింగ్ పేరు ఎందుకు చేర్చలేదు అన్నది ఇప్పటికీ క్యాడర్లో ఒక ప్రశ్నగా ఉంది. హుజరాబాద్ లో రాజాసింగ్ ప్రచారానికి వస్తే ముస్లిం ఓటర్ల దూరమవుతారనే భయంతో సొంత ఎమ్మెల్యేను దూరం పెట్టారని ఒక చర్చ జరుగుతుంది. ప్రచారానికి వెళ్లేందుకు ఆయన ఉత్సాహంగా ఉన్న ఆయన ప్రసంగాలు చేటు తెస్తే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందారట. అందుకే రాజా సింగ్ ను పక్కన పెట్టారని సమాచారం. బిజెపి ఓబీసీ మోర్చా  జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ సైతం ఇప్పటివరకు హుజరాబాద్ వెళ్లలేదు. ఈనెల  27 తో ఇక్కడ ప్రచారం ముగుస్తుంది. స్టార్ కంపెనర్ లిస్టులో లక్ష్మణ్ పేరు ఉంది.

బిజెపి సీనియర్ నాయకుడు ఇంద్రసేనా రెడ్డి సైతం సైలెంట్. బిజెపి జాతీయ కార్యవర్గాన్ని  ప్రకటించెంతవరకు యాక్టివ్ గా ఉన్న ఆయన జాబితాలో తన పేరు లేకపోవడంతో హర్ట్ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ఎన్నికల కమిషన్ వ్యవహారాలు ఇంద్రసేనారెడ్డే చూసేవారు. అలాంటిది ఇప్పుడు పార్టీ ఆఫీస్ కి కూడా రావడం లేదట. వీరే కాకుండా బిజెపి రాష్ట్ర పదాధికారుల్లో  మరికొందరు సైతం హుజురాబాద్ ప్రచారానికి దూరంగా ఉండడం పార్టీలో చర్చగా మారింది. మరి ఎందుకు దూరం పెట్టారో ఏంటో బిజెపి నేతలే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: