రాజకీయంలో శత్రుత్వం ఉంటుంది. అది శాశ్వతం కాదు. రాజకీయంలో స్నేహాలు ఉంటాయి. కానీ అవి కూడా శాశ్వతం కాదు. జీవితమే శాశ్వతం కానప్పుడు స్నేహాలూ, శత్రుత్వాలూ శాశ్వతం అవుతాయా అన్నది ఓ ప్రశ్న. ఈ ప్రశ్నకు అనుబంధంగానే కొన్ని పరిణామాలూ ఉంటాయి. వాటికి అనుబంధంగానే మన జీవితాలూ ఉంటాయి. రాజకీయాల్లో జగన్ తీరు వేరు. ఇంకా చెప్పాలంటే స్టైల్ వేరు. అవన్నీ కార్పొరేట్ పాలిటిక్స్. అయోధ్య రామిరెడ్డి, సాయిరెడ్డి ఇలాంటి వారంతా జగన్ తో ఉంటారు. జగన్ మాటలకు అనుగుణంగా తెర వెనుక తెర ముందు కూడా పనిచేస్తారు. నిమ్మగడ్డ ప్రసాద్ కూడా రెడ్డి సామాజికవర్గం కాకపోయినా జగన్ కు మద్దతు ఇస్తూ జగన్ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉంటారు. ఇవన్నీ అందరికీ తెలుసు. పాపం! కొందరు మాత్రం బలయిపోతుంటారు. కేసుల భయంతో కొంత, ఆస్తుల పరిరక్షణ పేరుతో కొంత తమని తాము తగ్గించుకుని శత్రువు చెంత చేరిపోతుంటారు. ఇప్పుడిదే ఏపీ పాలిటిక్స్ లో కీలకం కానుంది.
తెలుగుదేశం పార్టీ వీరాభిమాని వల్లభనేని వంశీ. ఒకప్పుడు ఇదంతా. నాకు జగన్ ఎవ్వరో తెలియదు అని కూడా చెప్పాడు. తరువాత వైసీపీలో చేరేటప్పుడు 90ల కాలం నుంచి పరిటాల రవి అనుచరుడిగా ఉన్నప్పటి నుంచి తాను జగన్ కు స్నేహితుడినేనని చెప్పాడు. ఇవన్నీ మాట మార్పుల్లో భాగం.చంద్రబాబు ను టార్గెట్ చేసుకుని వంశీ తోచిన రీతిలో తిడుతున్నారు. ఆయన చేసిన తప్పిదాలు ఏంటో చెప్పకుండా కేవలం వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణం.