ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరీ విజయం సాధించారు. ఇక ఇన్నేళ్లలో గులాబీ పార్టీ నుంచి ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రజా క్షేత్రంలోకి వెళ్లి మరీ విజయం సాధించారు. కేసీఆర్ ముందుగా సిద్ధిపేట నుంచి 2001 ఉప ఎన్నికతో పాటు 2004 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ తర్వాత 2004 ఉప ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి హరీష్ రావు ఎమ్మెల్యే గా తొలిసారి గెలిచారు. అప్పటి నుంచి ఆయన ప్రతి సారి తన మెజార్టీని అక్కడ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే ఆయన అక్కడ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక కేసీఆర్ మూడు సార్లు ఎంపీగా విజయం సాధించారు. ఆయన గత రెండు టర్మ్ లలోనూ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే గా గెలుస్తున్నారు.
ఇక సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఏకంగా వరుసగా నాలుగు సార్లు గెలుస్తూ వస్తున్నారు. 2009లో తొలిసారి కేవలం 71 ఓట్ల తేడాతో గెలిచిన ఆయన ఆ తర్వాత ఓటమి లేకుండా సిరిసిల్లను తన కంచుకోటగా చేసుకున్నారు. ఇక కేసీఆర్ కుమార్తె కవిత సైతం తొలిసారి 2014 ఎన్నికల్లో రాష్ట్రం వచ్చాక నిజామాబాద్ నుంచి ఎంపీ గా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆమె 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అయ్యారు.