ఏపీలో ఉన్మాదపాలన సాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. తాము డ్రగ్స్ పై పోరాటం చేస్తుంటే వైసీపీ ఒక ప్రణాళిక ప్రకారం దాడి చేసిందని ఆరోపించారు. పోలీసులే ఈ దాడులు చేయించి.. సురక్షితంగా వాళ్లను పంపించారని చెప్పారు. తమ ఆఫీసు పక్కనే సీఎం ఇల్లు, డీజీపీ ఆఫీసు, బెటాలియన్ ఉన్నాయన్నారు. అయినా దాడి జరిగిందని చెప్పారు. రాజ్యాంగబద్ద సంస్థలపైనా దాడులు చేస్తున్నారని.. హైకోర్టు న్యాయమూర్తులను దుర్భాషలాడుతున్నారని చెప్పారు.
ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా.. దాని చిరునామా ఏపీ అని పోలీసులు చెబుతున్నారన్నారు. ఏజెన్సీ ఏరియాలో 25వేల ఎకరాల్లో గంజాయి పెంచుతున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లిక్కర్ బ్రాండ్లు జగన్ తెచ్చారని.. మద్యపాన నిషేధం అని చెప్పి 3, 4 రెట్లు ధరలు పెంచి సొంత వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు.