బద్వేలు ఉప ఎన్నిక పోరు మరో మలుపు తీసుకుంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూయడంతో ఆయన భార్య దాసరి సుధ బరిలోకి దిగారు. సంప్రదాయ ప్రకారం వైసీపీ తరఫున మాత్రమే అభ్యర్థి మాత్రమే బరిలో నిలిస్తే ఎన్నిక ఏకగ్రీవం అయ్యేది. కానీ అలా కాకుండా బీజేపీ తో పాటు కాంగ్రెస్ కూడా బరిలో నిలిచింది. అయితే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ మాత్రం వినూ త్నంగా ఓ మాట చెబుతున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా కానీ ఇతర ప్రతిపాదనల విషయమై కానీ బీజేపీ తన మాట నిలబెట్టుకుంటే తాము పోటీ నుంచి తప్పుకుంటామంటూ ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఇవాళ ప్రత్యేక హోదా ఇచ్చేంత సీన్ బీజేపీకి లేకున్నా ఏదో ఒకటి అనాలి కనుక శ్రీకాంత్ ఆ విధంగా వ్యాఖ్యానించి ఉంటారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. దేవుడు కరుణిస్తే హోదా వస్తుందని లేకుంటే లేదని సీఎం హోదాలో ఢిల్లీ కేంద్రంగా జగన్ చెప్పిన మాటలు ఇప్పటికీ మరిచిపోలేం.
ఇప్పుడీ పరిస్థితుల్లో వైసీపీ సర్కారు పై ఉన్న బాధ్యత రాష్ట్రానికి హోదా విషయమై అడగడం. కానీ ఎంత అడిగినా హోదా మాత్రం రాదనే తేలిపోయింది. ఉన్న పళాన ఏదో గొప్ప మార్పు వస్తే తప్ప ఇక్కడి సమస్యలు పరిష్కారం కావు. హోదా లేకపోవడం వల్ల ఏపీ నష్టపోకుండా ఉండేందుకు ప్యాకేజీ ఇచ్చామని వైసీపీకి బీజేపీ చెప్పినా ఆ డబ్బులన్నీ ఎప్పుడో ఖర్చయి పోయాయి కనుక అలాంటి మాటలేవీ నెగ్గుకురావు. ఈ దశలో వైసీపీకి సాయం చేసేదెవ్వరు. బీజేపీ అన్న మాట ప్రకారం హోదా ఇవ్వడం అన్నది ఓ బాధ్యతగా తీసుకుంటుందా లేదా అన్నది ఓ సంశయం. ఇలాంటి తరుణంలో సునాయాసంగా నెగ్గాల్సిన బద్వేలు పోటీ ఇప్పుడు టఫ్ కాంపిటేషన్ గా మారింది. గెలిచేది వైసీపీనే అయినా ముఖ్యమంత్రి మాత్రం మెజార్టీ తీసుకుని రావాలని పట్టుబడుతున్నారు.
ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో మంత్రులను సైతం మోహరించి ప్రచారం ముమ్మరం చేశారు.