తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలను మరో వివాదం టెన్షన్‌ పెడుతోంది. ఏపీ, తెలంగాణను కలపాలన్న చర్చ హస్తం పార్టీ నేతల మధ్య మరోసారి విభేదాలు సృష్టిస్తోంది. ప్లీనరీ వేదికగా గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం, దానికి కౌంటర్‌గా ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన ప్రతిపాదనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సమైక్య రాగాలు వినిపిస్తున్నాయి. అయితే వ్యూహాత్మకంగా సమైక్య రాష్ట్ర చర్చను తెర మీదకు తెచ్చిన టీఆర్‌ఎస్‌, వైసీపీ తర్వాత సైలెంట్‌ అయ్యాయి. అయితే ఇదే అంశం కాంగ్రెస్‌ పార్టీలో అగ్గి రాజేసింది. తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ ఒకరు, రెండు రాష్ట్రాలు కలిపితే తప్పేంటని మరొక నేత మాట్లాడటం వివాదాస్పదంగా మారుతోంది.

ఏపీలోని పలువురు తమ పాలన కోరుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ప్లీనరీలో గొప్పగా చెప్పారు.  దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ కేసీఆర్ ఏపీలో పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని, అయితే రెండు రాష్ట్రాలను కలిపేసేలా ఆయన ఓ తీర్మానం చేస్తే బాగుంటుందన్నారు. దీనిపై  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వందల మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. అలాంటి తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కేసీఆర్ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగు తల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్ని నాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తీసుకురావడం కేసీఆర్, జగన్‌ ఉమ్మడి కుట్రలో భాగమని మండిపడ్డారు. జగన్ జైలుకు వెళితే సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని ఆలోచిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. ఈ అంశంపై భిన్నంగా స్పందించారు. సమైక్యంగా ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ సమైక్య వాదంతో ముందుకొస్తే తాను మద్దతు ఇస్తానని స్పష్టంగా తెలిపారు.  ఉద్యమ సమయంలోనూ తాను సమైక్య వాదాన్నే వినిపించానని గుర్తు చేశారు.  అప్పుడు అందరూ తనను తెలంగాణ ద్రోహి అన్నారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ అదే చర్చను చేస్తున్నారు. ప్లీనరీలో కేసీఆర్ కూడా పరోక్షంగా సమైక్య రాష్ట్రం కావాలనేలా మాట్లాడారని జగ్గారెడ్డి చెప్పారు. సమైక్య రాష్ట్రం అనేది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని.. పార్టీకి ఇది సంబంధం లేదన్నారు. అయితే ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ భిన్న స్వరాలపై తెలంగాణ కాంగ్రెస్‌లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. అసలు పేర్ని నాని కామెంట్స్‌పై టీఆర్ఎస్ సైలెంట్‌గా ఉంటే కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం వల్ల కేసీఆర్ ట్రాప్‌లో పడ్డారా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: