తెలంగాణా రాముడంటే బీజేపీకి లెక్కలేదా..? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా..? అసలు ఇంతకీ రాముడికి బీజేపీకి గొడవేమిటో పూర్తిగా తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. తాజాగా ఐఆర్ సీటీసీ, రామాయణం సర్క్యూట్ పేరుతో ఓ రైలును ఏర్పాటు చేసింది. రామాయణ్‌ యాత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు అయోధ్యలో ప్రారంభమై, రామేశ్వరం వరకూ ఉన్న అన్ని రాములవారి పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ రూట్ మ్యాప్ లో తెలంగాణకు చోటు దక్కలేదు. ఎంతో ప్రాచుర్యం పొందిన భద్రాచలం రామయ్యను బీజేపీ నేతలు మరచిపోయారు. దీంతో తెలంగాణ రాముడంటే అంటే బీజేపీ నేతలకు లెక్కలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

దేశంలోని ప్రధాన రాముడి ఆలయాల్లో భద్రాచలం చాలా కీలకమైంది. ప్రతీ సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి వేడుకలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అటువంటి భద్రాచలం రామయ్యకు జరిగిన అన్యాయంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ రామయ్యకు అన్యాయం చేసిందని.. ఇది కేవలం రాజకీయ కారణాలతో జరిగిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా ఉన్నప్పటికీ ఇలా జరగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై వివక్ష చూపుతోందని, బీజేపీ నేతలు కావాలనే భద్రాచలం రామయ్యకు ఈ యాత్రలో చోటులేకుండా చేశారని అంటున్నారు.

రామాయణ్‌ యాత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు అయోధ్యలో మొదలవుతుంది. అక్కడి నుంచి నందిగ్రామ్, బీహార్ లోని సీతా జన్మస్థానమైన సీతామర్షి మీదుగా.. జనక్ పూర్ చేరుకుంటుంది. ఆ తర్వాత వారణాసి, ప్రయాగ నుంచి సాగుతూ.. హంపీ చేరుకొని, అక్కడి నుంచి రామేశ్వరం వెళ్తుంది. ఇలా మొత్తంగా దేశంలోని రాముని పుణ్యక్షేత్రాలన్నిటినీ చుట్టేస్తోంది. 7500 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు చుట్టి వస్తుంది. ఇంతటి గొప్ప ప్రాజెక్టులో మన భద్రాచలానికి చోటు దక్కకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇకనైనా రామాయణ రైల్లో భద్రాచల రామయ్యను చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: