అమాయక గిరిజనులపై పోలీసుల దాష్టీకాలకు అద్దం పట్టే సినిమా ఇది. ఇది తమిళనాడులో 1990లలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారణంగా తెరకెక్కించిన సినిమా. అయితే.. ఇలాంటి ఘటనలు అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయి. ప్రత్యేకించి నోరులేని దళిత, గిరిజనులంటే పోలీసులకు మహా చులకన. తాజాగా సూర్యాపేట జిల్లాలో దొంగతనం కేసులో విచారణ పేరిట ఓ 23 ఏళ్ల యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటన జై భీమ్ సినిమాను తలపిస్తోంది.
అసలేం జరిగిందంటే.. ఆత్మకూర్(ఎస్) పోలీస్స్టేషన్ పరిధిలోని ఏపూర్లో ఇటీవల ఓ దుకాణంలో రూ.10 వేల నగదు, 40 మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా బానోత్ నవీన్ తో పాటు బానోత్ బుచ్చ్యా, బానోత్ లాల్సింగ్, గుగులోతు వీరశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. వీరశేఖర్ను బుధవారం అర్ధరాత్రి వదిలేశారు. అయితే.. అప్పటికే మంచంపై మూలుగుతున్న వీరశేఖర్ తనను రాత్రంతా పోలీసులు కొట్టినట్లు తెలిపాడు.
దొంగతనం అంగీకరించాలని నోట్లో గుడ్డలు కుక్కి మరీ తన కొడుకును కొట్టారని వీరశేఖర్ తల్లి చెబుతున్నారు. మూడు గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారని.. తెలిపింది. దీంతో మండిపడిన రామోజీ తండా వాసులు.. అతడిని ట్రాక్టర్పై ఠాణాకు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు.