హుజురాబాద్ లో ఉప ఎన్నిక తర్వాత తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ వరుస ప్రెస్ మీట్ లు పెట్టడం, తెలంగాణ బిజెపి నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారానికి తెరలేపాయి. ఇక వరి ధాన్యం కొనుగోలు పై  ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. తప్పు మీదంటే మీదంటూ ఇరు పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ గులాబీ నేతలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపు ఇవ్వగా కమలనాథులు ఒకరోజు ముందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని  ఎండగడుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు గులాబీ సైన్యం సిద్ధమైంది.

 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ధర్నాలు చేసేందుకు టీఆర్ఎస్  ఏర్పాటు చేసింది. వరి ధాన్యం కొనుగోలు పై సమస్య తీవ్రతను చాటేలా ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి ఆయా జిల్లాల నేతలు ముందస్తు అనుమతి  తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఆయా నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో ఆందోళనలు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొనేలా వ్యూహరచన చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు, కరీంనగర్ లో గంగుల కమలాకర్, హనుమకొండలో ఎర్రబెల్లి, వనపర్తి లో నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్, ఖమ్మంలో పువ్వాడ అజయ్, నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి, సూర్యాపేట జిల్లాలో జగదీష్ రెడ్డి ఆందోళనలో పాల్గొననున్నారు. ఇప్పటికే ధర్నాలకు పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు రైతులను కూడా భారీగా సమీకరించాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు లక్షల మంది రైతులు గులాబీ శ్రేణులు  ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: