ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని పేర్కొంది. ఈ సమావేశానికి సంబంధించిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం సమావేశానికి పిలిచినప్పుడు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొంది. ప్రజలు ఆకలితో చనిపోతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ ద్వారా అఫిడవిట్ దాఖలు చేయడం అసంతృప్తికరమన్నారు.
ఇది పౌష్టికాహార లోపానికి సంబంధించిన అంశం కాదని, ప్రజల ఆకలికి సంబంధించిన అంశమని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ రెండు అంశాలను ఒక దానితో ఒకటి పోల్చవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకరూప విధానం కావాలని, అందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు సూచనలు, సలహాలు తీసుకోవాలని పేర్కొన్నారు.