మినీ మున్సిపల్ ఎన్నికలు - యావత్ దేశాన్ని ఈ ఎన్నికలు ఆకర్షించాయి. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో జాతీయ పార్టీలకు చెందిన పెద్ద పెద్ద నేతలు ప్రచారం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో మినీ పురపోరు కూడా అదే స్థాయిలో అందరినీ అకర్షించింది. అయితే ఇక్కడ వివిధ పార్టీల అధ్యక్షులు ప్రచారం చేయలేదు. కానీ అందరి దృష్టిని ఆకర్షించడానికి మత్రం కారణం ఉంది. ప్రతిపక్షనేత, మజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నియోజక వర్గ కేంద్రం కుప్పం మున్సిపాలిటీకి ఎన్నిక. దీంతో ఈ ఎన్నికల పై అందరూ ఆసక్తి కనబరిచారు.
ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన మినీ మున్సిపల్ పోరులో అధికార పార్టీ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఒక్క దర్శి మున్సిపాలిటీలోనే ప్రతి పక్ష తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. 1989 నుంచి ఒకే శాసన సభ నియోజక వర్గంలో విజయాన్ని సొంతం చేసుకుంటూ రాజకీయాలలో ఉన్న ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, చంద్ర బాబు నియోజక వర్గం కుప్పం. ఈ నియోజక వర్గం లోని కుప్పం మున్సిపాలిటీ లోనూ అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ విజయ దుంధుభి మ్రోగించింది. నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికలోనూ అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా ముందుకు సాగుతోంది. నెల్లూరు నగరంలో 22 వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజేష్ వైసిపి ఆధిపత్యాన్ని కొంత వరకూ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జిల్లాలోని బుచ్చి రెడ్డి పాళెం నగర పంచాయితీ ఎన్నికల కౌంటింగ్ లో ఓ చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక్క ఓటు గెలుపు ఓటముల్ని నిర్ణయించింది. ఎనిమిదవ వార్డలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొందినట్లు అధికారులు తొలుత ప్రకటించారు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ రీ కౌంటింగ్ చేయాలని కోరింది. తెలుగు దేశం పార్టీ అభ్యర్థికూడా రీ కౌంటింగ్ జరపాలన్న అభ్యర్థనకు మద్దతిచ్చారు. రీ కౌంటింగ్ మరో సారి జరిగింది. చెల్లని ఓట్లను పకడ్బందీగా చెక్ చేశారు. దీంతో గెలుపు ఒక్క ఓటుతో వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని వరించింది. విజేతను తొలుత అభినందించినది తెలుగుదేశం అభ్యర్థే కావడం విశేషం.
సంస్థాగతంగా పునాదులు అంతగా లేని వై.ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల లోనూ, పురపాలికల్లోనూ విజయం సాధించడం ద్వారా పార్టీ పునాదులు గట్టి చేసుకోవాలని భావించింది. ఆ దిశగా అడుగులు వేసింది. ఎన్నికల్లో విజయం సాధించడం పై కేంద్రీకరించింది. ఇందుకు అనుగుణంగా వ్యూహాలు రచించింది. వాటిని అమలు చేసింది. ఎన్నికల్లో విజయం సాధించింది. వైెెఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత వచ్చిన ప్రతి ఎన్నికలోనూ అధికార వైఎస్ ఆర్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికల్లో విజయం సాధించి ప్రత్యర్థిని దెబ్బతీయడం ద్వారా అన్ని విషయాలలోనూ పై చేయి సాధించ వచ్చని వైఎస్ ఆర్ కాంగ్రెస్ తొలి నుంచి భావిస్తోంది. మినీ పురో పోరు లోనూ విజయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా వై.ఎస్.ఆర్. సి.పి వ్యూహం ఫలించినట్లుయింది.