భారతదేశం పుణ్యభూమి.. భారతదేశం కర్మ భూమి.. విశాలమైన భారతదేశంలో ఉంటున్నామని మనం తరచూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అపారమైన వనరులు ఉన్నాయని.. జీవనదులు కలిగిన దేశంగా మనకు మనం గొప్పలు చెప్పుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలోనే ప్రభావవంతమైన దేశాల్లో మనమూ ఉన్నామని సంబరపడిపోతున్నాం. అయితే ఇలా గొప్పలు చెప్పుకుంటున్నామే కానీ.. అభివృద్ధిలో మాత్రం భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే వెనుకబడిపోతోంది. దీనికి ప్రధాన కారణం లంచం. లంచాలకు అలవాటుపడిన మనం, బాధ్యతలను పూర్తిగా మరిచిపోతున్నాం. అందుకే లంచగొండి దేశంగా భారతదేశం కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

భారత దేశంలో ఏ పని కావాలన్నా లంచం ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. అధికారుల దగ్గర నుంచి, రాజకీయ నేతల వరకూ అందరికీ సమర్పించుకోవాల్సిన దుస్థితి ఇప్పుడు మనదేశంలో ఏర్పడింది. ఒకప్పుడు మనదేశంలో లంచాల అలవాటు ఉండేది కాదని, బ్రిటిష్ పాలన మొదలైనప్పటి నుంచీ ఈ విష సంస్కృతి మరింతగా పెరిగిపోయిందని అంటారు. బ్రిటిష్ అధికారులు మనదేశంలోని రాజ్యాలను ఆక్రమించుకోవాలంటే యుద్ధం కంటే ముందుగా లంచం ఇచ్చేవారు. రాజులకు లంచాలు ఇస్తే పనైపోతుందని భావించేవారు. ఇలా అలవాటైన లంచం ఇప్పుడు దేశం మొత్తం పాకి.. మన వ్యవస్థనే శాసిస్తోంది.

తాజాగా మనదేశంలో లంచ వ్యతిరేక ప్రమాణాల రూప కల్పన చేసే ట్రేస్ అనే సంస్థ ఓ సర్వే చేసింది. ఈ ఏడాది చేసిన సర్వేలో భారత్ గురించి దారుణమైన విషయాలు వెలుగుచూశాయి. లంచం ఇవ్వకుంటే మనదేశంలో ఏ పనీ జరగడం లేదని ఈ సంస్థ నివేదిక తేల్చేసింది. ఈ నివేదికలో మనదేశానికి గత ఏడాది 77వ ర్యాంకు ఉండగా.. ఇప్పుడు అదికాస్తా 82 వ స్థానానికి పడిపోయింది. మన దేశంలో కంపెనీల ఏర్పాటుకు అనుమతులు, లంచాలపై పౌరుల నిఘా, మీడియా వ్యవహరించే తీరు, అవినీతి నిరోధక శాఖ అధికారుల పనితీరు, ఇలా నాలుగు అంశాలను ఆధారంగా చేసుకొని ట్రేస్ సంస్థ ఈ నివేదిక ఇచ్చింది. దీనిని బట్టి చూస్తే మనదేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. లంచం అవసరం లేకుండా పనిజరిగే దేశాల్లో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తర కొరియాది చివరి స్థానం.

మరింత సమాచారం తెలుసుకోండి: