కార్తీక పుణ్య‌స్నానాలు, దేవర మొక్కులకు వెళ్లిన గ్రామస్తులను ఒక్క‌సారిగా పెద్దపులి వెంబడించింది. వారికి సమీపంలోనే తిరుగుతూ వారిని హడలెత్తించింది.  పులి ఎక్కడ నుంచి వ‌చ్చి దాడి చేస్తుందోననే భయంతో వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నాలుగు గంటలపాటు ఉక్కు బిక్కుమంటూ గడపాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ త‌రువాత పోలీసులు, స్థానికుల సహకారంతో ఎట్టకేలకు 30 మంది క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. కుమురంభీం జిల్లా దహెగాం మండలం లోహా సమీపంలో ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.  గురువారం మధ్యాహ్నం త‌రువాత ద‌హెగాం మండ‌లంలోని చిన్నరాస్పెల్లి గ్రామానికి చెందిన 30 మంది కార్తీక స్నానాలు, దేవర మొక్కుల కోసం ఎడ్లబండ్లపై దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు వాగుల గడ్డ వద్దకు వెళ్లారు. ఎర్రవాగు, పెద్దవాగు, మరోవాగు కలిసే చోట కార్తీక పుణ్య‌ స్నానాలు చేయాలని భావించారు.  అనువైన చోటుకోసం చూస్తుండగా అదే ప్రాంతంలో వారికి  అక‌స్మాత్తుగా పెద్దపులి కనిపించింది. దీంతో ఉక్కిరి బిక్కిరిగా భయపడిన గ్రామస్తులంద‌రూ ఒక్కచోట చేరి డప్పు చప్పుళ్లు చేయడంతో పాటు కేకలు వేశారు.

అయినా పులి అక్కడి నుంచి క‌ద‌ల‌లేదు.  అక్కడే ఉంటూ గ్రామస్తుల కదలికలను గమనించసాగిన‌ది. సాయంత్రం అయినా  అక్కడి నుంచి మాత్రం వెళ్లిపోలేదు పులి. వారికి సమీపంలోనే తిరుగుతూ కనిపించిన‌ది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు మండల రైతు సమన్వయ సమితి క‌న్వీన‌ర్ సంతోష్‌గౌడ్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఆయన ఇచ్చిన‌ వివరాల మేరకు అటవీ అధికారులు, దహెగాం ఎస్సై రఘుపతి, పోలీసు సిబ్బంది, చిన్నరాస్పెల్లి నుంచి వచ్చిన గ్రామస్తులు డప్పు చప్పుళ్లు చేసుకుంటూ.. కాగడాలు పట్టుకుని వాగు వద్దకు వెళ్లారు.

 అటవీ సిబ్బంది, పోలీసులు వచ్చే సమయానికి పులి కాస్త దూరంగా వెళ్లిపోయినా, మళ్లీ    అది  ఏ దిక్కు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరికి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అధికారులు వాగువద్ద చిక్కుకున్నవారిని క్షేమంగా గ్రామానికి తీసుకు రావడంతో వారంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. గత  ఏడాది నవంబర్‌లో పెద్దపులి ఇద్దరిపై దాడి చేసి చంపిన విషయం విధిత‌మే.  తాజా ఘటనతో పత్తి తీయడానికి వెళ్లే వారు సైతం భయాందోళనకు గుర‌వుతున్నారు.

దాదాపు నాలుగు గంటలు ఉత్కంఠగా కొన‌సాగింది. దేవ‌ర‌ను తీసుకొని చిన్న‌రాస్పెల్లి నుంచి లోహా స‌మీపంలో మూడు వాగుల గడ్డ వ‌ద్ద‌కు స్నానానికి వెళ్లామ‌ని, ముందుగా కుక్క అనుకొని కేక‌లు వేసాం. ఆ త‌రువాత చూసే సరికి పులి అని తెలిసింది. ఒక్క‌సారిగా భ‌యానికి గుర‌య్యామ‌ని గ్రామ‌స్తులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: