అవును.. కరోనా విషయంలో అనేక విషయాల్లో ఇజ్రాయిల్ దేశం చాలా మందుంది.. ఇజ్రాయెల్లో గత డిసెంబరులోనే ఫైజర్-బయాన్ టెక్ టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటికే చాలా దేశాలు అసలు టీకా గురించి ఆలోచించనే లేదు కూడా. ఆ తర్వాత కొన్నాళ్ల క్రితం వేసవిలో డెల్టా వేరియంట్ విజృంభించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఇజ్రాయిల్ ఏకంగా బూస్టర్ డోసులు కూడా ప్రారంభించింది. కొన్ని దేశాల్లో అసలు ఒక్కడోసు కూడా అందని సమయంలోనే ఇజ్రాయెల్ ఏకంగా బూస్టర్ డోసులు వేసింది. ఇలా ప్రపంచంలోనే మొదట బూస్టర్ డోసులు ఇచ్చిన తొలి దేశంగా ఇజ్రాయెల్ చరిత్ర సృష్టించింది.
అంతే కాదు.. కరోనా టీకాలు ఇచ్చినా.. బూస్టర్ డోసులు ఇచ్చినా.. ఇజ్రాయెల్ అక్కడితో ఆగలేదు సుమా. మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి గ్రీన్ పాస్లు ఇచ్చి అది ఉంటేనే రెస్టారెంట్లు, ఈత కొలనులు, ఆఫీసుల్లో ప్రవేశం కల్పించింది. అంతేనా.. రెండు మోతాదులు పూర్తి చేసుకున్నా.. బూస్టర్ డోసు తీసుకోకపోయినా గ్రీన్ పాస్లు రద్దు చేసింది. అంతే కాదు.. రెండు డోసులు పూర్తి చేసుకున్నా కరోనా వస్తున్న వారిని గుర్తించి వారిపై కొత్త ప్రయోగాలు చేస్తోంది. రెండు డోసులు పూర్తయినా కరోనా మళ్లీ ఎందుకు వస్తోందన్న అంశంపై పరిశోధనలు కొనసాగిస్తోంది. ఇలా మొదటి నుంచి కరోనా విషయంలో ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయోగాలు ఇతర దేశాలకు ఉదాహరణలుగా మారుతున్నాయి.