గత 2018 ముందస్తు ఎన్నికల్లో తుమ్మల పాలేరు లో ఓడిపోయినా... ఖమ్మం నుంచి గెలిచిన కమ్మ నేత పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి పదవి ఇచ్చారు. కెసిఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఆ పార్టీ తరఫున ఎవరూ కమ్మ ఎంపీ లేరు. 2019 ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు కు ఖమ్మం ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఇక టిఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీల విషయానికొస్తే తుమ్మల నాగేశ్వరరావుకు మాత్రమే ఆ పదవి ఇచ్చారు.
తుమ్మలకు మాత్రమే కమ్మ కోటాలో ఎమ్మెల్సీగా తొలిసారి అవకాశం దక్కింది. ఆ తర్వాత నుంచి రెండో కమ్మ ఎమ్మెల్సీ గా ఎవరు లేరు. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటాలో పాలేరు నియోజకవర్గానికి చెందిన కమ్మ నేత, ఎన్ఆర్ఐ తాతా మధు కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. జిల్లాలో కొందరు నేతలతో ఆయనకున్న పరిచయాలకి తోడు కేసీఆర్ కు అత్యంత ఆప్తుడైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తో విద్యార్థి దశలో ఉన్న స్నేహం కూడా ఆయనకు కలిసి వచ్చిందని చెబుతున్నారు.