కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ లో భాగంగా 50 లక్షల డోసుల కరోనా టీకాలను నాలుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విన్నపం చేసింది. ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎగుమతులకు అనుమతి ఇచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్, నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్ దేశాలకు సీరం ఇన్స్టీట్యూట్ సంస్థ వ్యాక్సిన్లను ఎగుమతి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పుణెకు చెందిన సీరం సంస్థ 24,89,15,000 కొవిడ్ వ్యాక్సిన్ డోస్ల స్టాక్ను సిద్ధం చేసిందని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)లోని ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలిపారు.
అయితే, ఈ డోసులను వేగంగా పంపిణీ చేయకుంటే తమ కంపెనీకి శీతల గిడ్డంగులు, మానవ వనరుల పరమైన ఇబ్బందులు వస్తాయని.. కాబట్టి ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని ‘కోవ్యాక్స్’ కార్యక్రమంలో భాగంగా నేపాల్, బంగ్లాదేశ్, మొజాంబిక్, తజకిస్తాన్ దేశాలకు 50 లక్షల డోసులను ఎగుమతి చేసేందుకు అనుమతించాలని సీరం ఇన్స్టీట్యూట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించించినట్టు ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, గతంలోనే `వ్యాక్సిన్ మైత్రి` పేరుతో నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్లకు 10 లక్షల కోవీషీల్డ్ టీకాలను అందించడానికి సీరం ఇన్స్టిట్యూట్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.