మరోసారి పగడ్బందీగా మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం జగన్ ప్రకటించడంతో జనసేనాని ఇరుకున పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఈసారి విశాఖను ప్రధానంగా చేసుకుని అక్కడినుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. గతంలో గాజువాకతోపాటు భీమవరంలో కూడా పవన్ పోటీ చేశారు. అయితే రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. అందుకే ఈసారి మాత్రం విశాఖకే ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటున్నారు. ఈ టైమ్ లో మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గకుండా జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇన్ డైరెక్ట్ గా షాకిచ్చారు సీఎం జగన్.
2024లో వైసీపీ ప్రధానంగా మూడు రాజధానుల నిర్మాణం, సమగ్ర అభివృద్ధి అనే అంశాలతోనే ఎన్నికలకు వెళ్లబోతోంది. ఒకవేళ ఇదే కనుక వైసీపీ ప్రధాన అజెండా అయితే పవన్ మూడు రాజధానులకు వ్యతిరేకంగా విశాఖ నుంచి పోటీ చేయగలరా..? విశాఖపట్నం వెళ్లి.. జై అమరావతి అనగలరా.. అంటే మాత్రం కచ్చితంగా కుదరదని చెప్పాలి. ఎందుకంటే మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ వస్తే విశాఖపట్నం మరింతగా అభివృద్ధి చెందుతుంది. విశాఖ ప్రజలు కూడా మూడు రాజధానులకే ఓకే చెబుతారు. ఇలాంటి పరిస్థితిలో జనసేన అధినేత పవన్, విశాఖలో పోటీ చేయడం కుదిరే పనిలా కనిపించడం లేదు. ఉక్కు ఉద్యమంతో విశాఖలో బలపడాలని చూస్తున్న జనసేనాని పాచిక పారేలా కనిపించడంలేదు. అంటే పవన్ కల్యాణ్ రాయలసీమ, ఉత్తరాంధ్రలో పోటీ చేసే అవకాశం లేదనే చెప్పాలి. అమరావతి చుట్టు పక్కల మంచి నియోజకవర్గాన్ని వెదుక్కోవాల్సిందే.