ఇదంతా ఒక ఎత్తు అయితే.. చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రముఖులంతా మాయం అవుతుండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారంతా.. మాయం అవుతున్నారు. అసలు వారి జాడ కనిపించడం లేదు. గత కొద్ది కాలంగా ఇలాంటి ప్రముఖుల మిస్సింగ్ మిస్టరీగా మారుతోంది.
కొన్నిరోజుల క్రితం చైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార దిగ్గజం ఆలీబాబా అధినేత జాక్ మా కనిపించకుండాపోయారు. ఆ తర్వాత మరికొందరు వ్యాపారవేత్తలు, కళాకారులు, సినీనటులు, ఉన్నతాధికారులు, మీడియా అధినేతల పరిస్థితీ అలాగే మారింది. తాజాగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి కూడా కనిపించడం లేదు. ఇంటర్పోల్కు చీఫ్గా ఎన్నికైన చైనాకు చెందిన మెంగ్ హాంగ్వే కూడా కొన్నాళ్లుగా కనిపించడం లేదు. ఈయన 2016లో ప్రపంచ వ్యాప్తంగా పోలీసులకు సహకారం అందించే ‘ఇంటర్పోల్’ విభాగానికి చీఫ్ అయ్యారు.
అయితే అంతకుముందు హాంగ్వే చైనా ప్రజాభద్రతా విభాగానికి ఇంఛార్జిగా ఉన్నారు. ఆయన 2018 నుంచి కనిపించడం లేదు. ఇంటర్పోల్ కు చీఫ్గా ఉన్న హాంగ్వే చైనాకు బయలుదేరినట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత నుంచి ఆచూకీ లేదు. ఈ మధ్య మీడియా ముందుకు వచ్చిన గ్రేస్ మెంగ్ తన భర్త ఆచూకీ ఇప్పటికీ లభించలేదని రోదించారు. కళాకారుడు, చిత్ర నిర్మాత అయ్ వీవీ, ప్రముఖ పాప్ సింగర్ ఝావో, హాంకాంగ్ వేదికగా ప్రచురణలు చేసే గువై మిన్హాయ్.. ఇలా కొందరు ప్రముఖులు ఏళ్ల తరబడి చైనాలో కనిపించడం లేదు.