రాజధాని నిర్మాణానికి మొత్తం 50 వేల ఎకరాలు అవసరం అవుతుందని, అప్పటి ప్రభుత్వం అంతటి స్థలాన్ని నోటిఫై చేసిందని, ఈ మేరకు సీఆర్డీఏ కూడా ఏర్పాటు చేసిందని ఓ వాదన వినిపిస్తోంది వైసీపీ సర్కారు నుంచి! అయితే ఒక్కో ఎకరం అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఆ లెక్కన చూసుకుంటే లక్ష కోట్ల రూపాయలు కేవలం డ్రైన్లు రోడ్లు ఇతర మౌలిక వసతుల కల్పనకే అవసరం అవుతాయని అప్పటి ప్రభుత్వం లెక్కల ప్రకారమే తేలిందని జగన్ చెబుతున్నారు. అయితే అంత మొత్తాన్ని వెచ్చించే కన్నా విశాఖను రాజధాని గా చేసుకుంటే మేలు అన్న వాదన ఒకటి జగన్ నుంచి వినిపిస్తోంది.
అయితే ఇక్కడే ఓ మతలబు ఉంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి కొంత ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పుడు కానీ లేదా భూ సేకరణ పేరిటో సమీకరణ పేరిటో భూమిని రైతుల నుంచి తీసుకున్నప్పుడు కానీ ఏ రోజూ వైసీపీ అడ్డు పడలేదు. అసెంబ్లీ వేదికగా కూడా జనాభీష్టమే తమ అభీష్టం అని మాత్రమే చెప్పింది. ఆ విధంగానే నడుచుకుంది కూడా! కానీ ఇప్పుడు ఇదంతా ఓ పెద్ద రాజకీయ జూదంలా ఉందని అందుకే తాము ఈ జూదంలో తలదూర్చమని, విశాఖ కేంద్రంగా పాలన సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అంటున్నారు జగన్. అవును! ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చిన డబ్బులు
అన్నీ ఏమయ్యాయని ? ఎందుకు ఇంతటి స్థాయిలో ప్రజా ధనం దుర్వినియోగం చేశారని? అంటే ఆ రోజు కేంద్రం ఇవేవీ తెలుసుకోకుండానే నిధులు ఇచ్చి గుడ్డిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మిందా లేదా బాబు గారితో ఉన్న స్నేహంలో భాగంగానే కేంద్రం నిధులు ఇచ్చి తన ధర్మం నిర్వర్తించిందా అన్నది కూడా తేలాలి. రాజధాని నిర్మాణానికి ఆ రోజు పదిహేను వందల కోట్లు కేంద్రం
ఇచ్చిందని పురంధరి లాంటి లీడర్లు చెబుతున్నారు. ఆ నిధులకు ఇంకొన్ని నిధులను కలుపుకుని చూసినా దాదాపు ఓ మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించారే అనుకుందాం. అంటే మూడు వేల కోట్ల రూపాయలూ బూడిద లో పోసిన పన్నీరేనా! ఈ పాటి
లెక్కలు తెలియకుండానే బాబు గారు అమరావతిపై ప్రేమ చూపారే అనుకుందాం. మరి మిగతా ప్రాంతాలు ఏమయిపోవాలి అన్న
ప్రశ్న బాగానే ఉన్నా ఆయా ప్రాంతాల కోసం వైసీపీ ఏం చేస్తుందో మాత్రం చెప్పడం లేదు. అవును సచివాలయం ఏర్పాటుతో విశాఖ అభివృద్ధి కాదు మారుమూల శ్రీకాకుళంకూ సచివాలయ ఏర్పాటుకూ ఏంటి సంబంధం? కనుక మా ప్రాంతాల అభివృద్ధికీ రాజధాని పేరిట సాగుతున్న రాజకీయాలకూ అస్సలస్సలు సంబంధం లేదు. ఇక కర్నూలులో మీరు చెప్పిన విధంగా హైకోర్టు
ను సెట్ చేశారే అనుకుందాం దానివల్ల కర్నూలు రాత్రికి రాత్రి డెవలప్ అయిపోతుందా అనంతపురంలోనో లేదా మరో సీమ ప్రాంతంలోనో మారుమూల ప్రాంతాలకు తాగునీరు వచ్చేస్తుందా అభివృద్ధి మాట దేవుడెరుగు ఇప్పటికీ సీమకు తాగునీరేలేని ఊళ్లే
ఎక్కువ. మరి! వాటి కోసం మీరేం చేస్తారు?