3 రాజధానుల బిల్లు రద్దు తరువాత కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. రాజధాని అవసరతలు అందరివీ కనుక ఆ హక్కు కూడా అందరికీ ఉంటుందని సీమ వాదిస్తోంది. ఇప్పటిదాకా తాము నష్టపోయింది చాలు అని తాము రాజధాని కోసం అని కాకుండా కేవలం ప్రాంత హక్కుల సాధన కోసమే ఉద్యమాలు చేస్తామని చెబుతోంది. నిన్నటి వేళ రాజధాని కి సంబంధించిన చర్చలో కూడా కర్నూలు ప్రస్తావన ఒకనాటి రాజధానిగా ఉన్న వైనం అన్నీ అన్నీ మాట్లాడిన ఆర్థిక మంత్రి బుగ్గన తమ ప్రాంతంకు చెందిన వారే అయినప్పటకీ తమకు ఏం చేస్తారో స్పష్టంగా వివరించడంలో విఫలం అయినారని సీమ వాసులు అంటున్నారు. ఆందోళన చెందుతున్నారు.
ఆయన చెప్పిన విధంగానే విభజన తరువాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు జిల్లాకొకటి చొప్పున ఆవిర్భవించాల్సి ఉందని కానీ ఆ దిశగా ఏ చర్యలూ లేవని అంటున్నారు. అసలు తమకు హైకోర్టు తో కూడిన న్యాయ రాజధాని కన్నా తమ ప్రాంతం అభివృద్ధి ఇంకా ముఖ్యమని ఎందుకంటే ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులుగా ఎన్నికయిన వారంతా ఇతర ప్రాంతాలపై ఇంకా చెప్పాలంటే చంద్రబాబుకు కానీ జగన్ కు కానీ కోస్తా ప్రాంతంపై మక్కువ ఎక్కువగా ఉందని, బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు లేదా అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలపై ఉన్న ప్రేమ వెనుకబడి ఉన్న ప్రాంతాలపై ఎందుకు చూపించరని అంటే ఇక్కడ అభివృద్ధి చేసినా కార్పొరేట్ శక్తులను తాము ఆకర్షించలేం అని, ఆ విధంగా ఆర్థిక ప్రయోజనాలు అందుకోలేమని
అటు చంద్రబాబు కానీ జగన్ కానీ ఆలోచిస్తున్నారా అని నిలదీస్తున్నారు సీమ వాసులు.
తాము వద్దనుకున్న యురేనియం శుద్ధి కర్మాగారం కడపలో ఉంటుందని, తాము కావాలనుకున్న అభివృద్ధి మాత్రం తమకు దక్కదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తాము వద్దనుకున్నవన్నీ ఇంతకాలం భరించామని కానీ ఇకపై భరించే శక్తి తమకు లేదని వీరంతా గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల క్షేత్రం కారణంగా ఎగువ ప్రాంతం (ఎగువ తిరుపతి) అభివృద్ధికి నోచుకుందే కానీ దిగువ ప్రాంతం (దిగువ తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం ఉన్న ప్రాంతం) ఇప్పటికీ సరైన రీతిలో ప్రగతి సాధించనేలేదని వీరంతా ఆందోళన చెందుతున్నారు.
ఏటా కోట్లలో ఆదాయం వచ్చే ఆలయం ఎందుకని సీమ గ్రామాలను దత్తత తీసుకోవడం లేదని కూడా వీరు ప్రశ్నిస్తున్నారు. ఆదాయం ఉన్నచోటే అభివృద్ధి అన్న విధానమే అన్ని రకాల వెనుకబాటుకూ కారణం అయిందని, నిన్న బుగ్గన కూడా ప్రేమ అంతా హైద్రాబాద్ పైనే ఆ రోజు ఉంచారని అంటున్నారని..ఇప్పుడు కూడా ప్రేమను రాజధాని అనే నెపంతో చూపించడం కన్నా ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి పాదం కదపాలని వేడుకుంటున్నారు వీరు.