చాలా రోజుల కిందట చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. సమైక్యాంధ్ర అన్నప్పుడు లేదా వేర్పాటు తప్పదు అని అనుకుంటున్నప్పుడు మాకెందుకు ఈ గొడవ మమ్మల్ని ఒడిశాలో కలిపేయండి అని అడిగారు కొందరు శ్రీకాకుళం మేథావులు.. అది వారి విజ్ఞత. అది వారికి ఉన్న అవగాహన. లేదంటే ఆ రోజు ఉన్న సమాచారం అనుసరించి అటు గంజాం పర్లాకిమిడి ప్రాంతాలతో పాటు ఇటు మూడు జిల్లాల ఉత్తరాంధ్రను కలిపి ప్రత్యేకమయిన రాష్ట్రంగా ప్రకటించమని కూడా అడిగారు.
రాజధాని ఏదయినా మాకు అభ్యంతరం లేదు అనేంత అమాయకులు మా ఊరి వాళ్లు. అందుకే మాకు రాజకీయం కావాలే కానీ రాజధాని అవసరం లేదు. ఆ విధంగా మేం ముందున్నాం. ఆ విధంగా మేం వెనకబడిపోయాం. అవును మా ధర్మాన అన్న విధంగా రాజధానితో మాకు పనేంటి? ఆహా! ఒకవేళ రాజధాని విశాఖ అయిందే అనుకోండి ఈ ప్రాంతానికి వచ్చే లాభం ఏంటి.? ఇప్పటికిప్పుడు రియల్ వెంచర్లు రావడం తప్ప ఆ విధంగా మా రాజకీయ నాయకుల పొలాలో స్థలాలో విలువ పెంచుకోవడం తప్ప మాకు జరిగిందేంటి ఉండదు గాక ఉండదు. కనుక రాజధానితో మాకు పనే లేదు. అసలు మాకు వేటితోనూ సంబంధం ఉండదు ఎందుకంటే మేం ఓ మూలన ఉన్న వారం. ఎవ్వరితోనూ నీళ్ల తగాదా లేని వాళ్లం. కొద్దిగా అరిస్తే ఒడిశా అరుస్తుంది. ఆ అరుపు కూడా మాకు పెద్దగా పట్టదు లేండి అది వేరే విషయం. అలాంటప్పుడు మాకు రాజధాని నజరానాలతో మాకు పనేంటి?