ఇంతకీ జగన్ ఎందుకు తాడేపల్లిలోనే ఉంటున్నారు. ఆయన జనాల వద్దకు ఎందుకు రావడం లేదు అన్నదే విపక్షాలు సంధిస్తున్న ప్రశ్న. రెండున్నరేళ్ళ జగన్ ఏలుబడిలో ఆయన బయటకు వచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. ఎక్కడికి వెళ్లినా కూడా రాత్రికి తాడేపల్లికి వెళ్ళిపోతున్నారు. అయితే ఏపీలో కరోనా రెండు దశలుగా వచ్చి జనాలను హడలెత్తించింది. ఆ టైమ్ లో తెలంగాణా సీఎం కేసీయార్ జనంలో ఉన్నారు. ఆసుపత్రులు సందర్శించారు.
కానీ జగన్ మాత్రం తాడేపల్లి నుంచే టోటల్ గా మోనిటరింగ్ చేశారు. ఇపుడు జగన్ని వైసీపీని ఎంతగానో ఆదరించిన రాయలసీమ జిల్లాలలో కనీ వినీ ప్రళయం సంభవించింది. అయినా జగన్ ఒకసారి ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయారు అన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. జగన్ని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అయితే వర్క్ ఫ్రం హోమ్ సీఎం అనేశారు. ఇక చంద్రబాబు అయితే ఏకంగా జగన్ని వృద్ధుడిని చేశారు.
జగన్ నడవలేడు, రాలేడు అంటూ ఎద్దేవా చేశారు. నిజంగా ఇలాంటి టైమ్ లో జనంలో ఉంటేనే వారికి అండగా ఉంటుంది. చంద్రబాబు హుదూద్ తుఫాన్ సమయంలో అయితే వారం రోజుల పాటు విశాఖలోనే మకాం వేశారు. మరి జగన్ పనితీరుని బాబుతో పోల్చుకుంటున్నారు. జగన్ మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేల మీదనే బాధ్యతలు పెట్టారు. వారు చేయరని కాదు కానీ ముఖ్యమంత్రి వెళ్తే ఆ సీనే వేరుగా ఉంటుంది. అన్నీ తెలిసిన జగన్ కి ఇది తెలియదు అని ఎవరూ అనుకోగలరా. మొత్తానికి జగన్ కేరాఫ్ తాడేపల్లిగా ఎందుకు మారిపోయారు అన్న విపక్షాలు, జనాలు వేసే ప్రశ్నలకు జవాబు మాత్రం ఆయనే చెప్పాలిగా.