అసెంబ్లీలో పేర్ని నాని ప్రకటనతో సినీ ప్రేమికులు సంబరపడిపోతున్నారు. ఇన్నాళ్లూ కొత్త సినిమాలకు, భారీ బడ్జెట్ సినిమాలు చూడాలంటే జేబులు ఖాళీ అయ్యేవని, ఇకపై ఆ పరిస్థితి ఉండదని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు ఎగ్జిబిటర్లు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తాము కూడా ఎప్పటినుంచో ఈ విధానం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ నిర్ణయం, కొందరు బడా నిర్మాతలకు ఇబ్బందికరంగా మారనుంది. కొత్త సినిమాలైనా, భారీ బడ్జెట్ సినిమాలైనా ఒకే ధరకు టికెట్ అంటే వీరంతా అంగీకరించే పరిస్థితి లేదు. ప్రభుత్వంపై ఈ విషయంలో కచ్చితంగా ఒత్తిడి తీసుకు వస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
సినీ పెద్దలు ఇప్పటికే ఈ విషయంపై చాలాసార్లు ఏపీ మంత్రి పేర్ని నానిని కలిశారు. సీఎం జగన్ తో కూడా చిరంజీవి, నాగార్జున తదితర ప్రముఖులంతా కలిశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ నిర్ణయంతో మళ్ళీ జగన్ పై ఒత్తిడి తీసుకు వస్తారని సమాచారం. అయితే జగన్ ఈ విషయంలో అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటారా.. లేక వెనక్కు వెళ్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ జగన్ ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే, మాత్రం ఒత్తిళ్లకు తలొగ్గినట్టేనని భావిస్తున్నారు. అదే సమయంలో జగన్ కు వెనకడుగులు అలవాటయ్యాయనే విమర్శలు వస్తాయి. ఏది ఏమైనా ఈ విషయంపై ఇప్పటివరకూ టాలీవుడ్ ప్రముఖులెవరూ నోరు మెదపకపోవడం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది.