వాస్తవానికి బీజేపీకి గతంలో కంటే తెలంగాణలో ఇప్పుడు మెరుగైన పరిస్థితి ఉందనే చెప్పకతప్పదు. దీనికి తోడు కేసీఆర్ ఇటీవల బీజేపీతో పాటు రాష్ట్ర బీజేపీ నాయకులను టార్గెట్ చేయడంతో తమకు పోటి ఇచ్చే రేంజ్లో బీజేపీ ఉందని చెప్పకనే చెప్పినట్టయింది. దానికి తోడు గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్న బీజేపీకి ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు. అయినా, తెలంగాణలో బీజేపీ అంత బలం లేదనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ తరఫున ఆయా నియోజవర్గాల్లో పోటీ చేసి గెలిచేంత బలమైన నాయకులు లేరు. ఒక వేళ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఈటల ఎలా వెళ్లారో.. ఆ విధంగా కొందరు నాయకులు కారు పార్టీ కండువా కప్పుకుని మళ్లీ పోటీ చేస్తే తప్ప బీజేపీ గెలిచే అవకాశం లేదు.
మరోపక్క కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడిప్పుడే నూతన ఉత్తేజం వస్తున్న క్రమంలో హుజురాబాద్ ఓటమి తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఘోర ఓటమి పాలవ్వడంతో అసంతృప్తి వ్యక్తం అయింది. పైగా మళ్లి పార్టీలో అంతర్గత పోరు చెలరేగడంతో ఎక్కడ వేసిన గొంగడిలాగే అయిపోయింది. దీంతో పాటు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లొల్లిలో కాంగ్రెస్ పార్టీని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదనేది స్పష్ంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే తెలంగాణలో టీఆర్ఎస్ కాస్త వీక్ అయినట్టు కనిపిస్తున్నా బీజేపీ, కాంగ్రెస్లను ఎదర్కునే శక్తి మాత్రం పోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.