బీజేపీలో ముసలం ఉందా..లేదా రానుందా? ఎందుకంటే ఇప్పటిదాకా టీబీజేపీ ని నడిపే శక్తిగా పేరున్న కిషన్ రెడ్డి కానీ విద్యాసాగర్ రావు కానీ అంతగా యాక్టివ్ గా లేరు. ఉన్నా కూడా మునపటి వేగంలో కూడా లేరు. ఏవో కొన్ని పరిణామాలు తెలంగాణ ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్ లో జరిగితే తప్ప వీళ్లు యాక్టివ్ కాలేకపోతున్నారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాలకూ కేంద్ర మంత్రి హోదాలో కిషణ్ రెడ్డి పెద్దగా ఉన్నారు. కనుక అక్కడ పరిణామాలపై కూడా ఓ కన్నేసి ఉంచారు కిషన్ రెడ్డి. ఇక తెలంగాణలో ఇదివరకటి కన్నా ఇప్పుడు కాస్త పార్టీ పొజిషన్ బెటర్ అయినా కూడా అదంతా కొద్ది రోజులకే కొన్ని ఎన్నికలకే పరిమితం అని కూడా తేలిపోయింది. కిషణ్ రెడ్డి ప్రభావం కానీ ఇతర సీనియర్ నాయకుల ప్రభావం అన్నది రావాలంటే, వారికి ఉన్న శక్తితోపాటు ఇంకొన్ని శక్తులు కూడా కలసి రావాలి. కానీ తెలంగాణలో సీన్ అలా లేదు. మంచో చెడో తెలంగాణ యావత్తూ కేసీఆర్ వైపే ఉన్నారు. ఆ పాటి శ్రద్ధ బీజేపీ నాయకులకు లేదనే తేలిపోయింది. ముఖ్యంగా పార్టీ పెద్దలు ఎవ్వరూ కూడా తెలంగాణ కోసం కేంద్రం ఏం చేస్తుంది ఏ విధంగా సాయం అందిస్తుంది అన్నవి వివరించలేకపోతున్నారు. దీంతో మోడీ, అమిత్ షాలాంటి నేతలు వచ్చి వెళ్లడం మినహా సాధించిందేమీ లేదు. రాములమ్మ ప్రగల్బాలు ఎలానూ ఉన్నాయి. కానీ అవేవీ పార్టీ బలోపేతానికి జనవాహినిలో ఓ సేతు నిర్మాణానికి సహకరించవు.
బండి సంజయ్ లాంటి నేతలు కేవలం వ్యాఖ్యలకే పరిమితం తప్ప కార్యాచరణ అన్నది ఉండదు గాక ఉండదు. ఒకప్పుడు మతతత్వ శక్తిగా భాగ్యనగరంలో పేరున్న ముస్లీం నాయకత్వాల ను వ్యతిరేకించే పార్టీగా ముఖ్యంగా ఎంఐఎం ను ఎదిరించే శక్తిగా బీజేపీ ఉండాలని భావించింది. అలానే కిషన్ రెడ్డి రాజకీయం చేశారు. కానీ బీజేపీకి, ఎంఐఎంకు ఉన్న లోపాయి కారి ఒప్పందం కారణంగా కొన్ని చోట్ల ముఖ్యంగా మహారాష్ట్రలాంటి చోట్ల బీజేపీకి మంచి సాయం చేసి మోడీ భక్తి ని చాటుకుంది ఎంఐఎం. దీంతో బీజేపీని తెలంగాణతో సహా ఇతర ప్రాంతాలలో కూడా పెద్దగా నమ్మేందుకు అవకాశం లేకుండా పోయింది. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం ఆయనకు అనుగుణంగా రాజకీయం చేసిన ఎంఐఎం తరువాత మాత్రం బీజేపీకి అనుగుణంగా కొన్ని సార్లు, గులాబీ దండుకు అనగుణంగా కొన్ని సార్లు మాట్లాడకుండానే క్షేత్ర స్థాయిలో తన పని తాను మౌనంగా చేసుకుని పోయింది. దీంతో కిషన్ రెడ్డి కానీ ఎంఐఎం అధినేత అసరుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మినహా సాధించింది ఏమీ లేదనే తేలిపోయింది. వీరికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తోడయినప్పటికీ పార్టీని బతికించేందుకు ఇలాంటివేవీ ఉపయోగపడవు అని కూడా ఎప్పుడో నిర్థారణ అయింది.