ముఖ్యంగా పార్టీకి దూరమైన వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు ముందు నుంచి తప్పు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. వంశీ పార్టీకి దగ్గర అయినప్పుడే చంద్రబాబు వంశీ ని పార్టీ నుంచి బహిష్కరించి ఉంటే బాగుండేదన్న కామెంట్లు అవుతున్నాయి. వంశీని పార్టీ నుంచి బహిష్కరించ కుండా చంద్రబాబు సాధించింది ఏంటి అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
వంశీ పేరుకు మాత్రమే సాంకేతికంగా పార్టీలోనే ఉంటున్నారు. ఓవైపు టిడిపిని చంద్రబాబును విపరీతంగా తిడుతూ చివరకు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. కేవలం షోకాజ్ నోటీసు ఇచ్చి వదిలేయటం వల్ల వంశి మరింతగా రెచ్చిపోతున్నారు. వంశీని పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయన నేరుగా వైసీపీలో చేరిపోతారు అనే బాబు ఆ నిర్ణయం తీసుకోలేదు.
అయితే ఇప్పుడు ఆయన వల్ల పార్టీకి కొత్తగా జరిగే నష్టం కూడా లేదు. అయినా చంద్రబాబు ఎందుకు బహిష్కరించడం లేదన్న వాదన పార్టీలోనే వినిపిస్తోంది. వంశీని పార్టీ నుంచి బహిష్కరిస్తే అప్పుడు పార్టీకి కూడా గౌరవంగా ఉంటుందని... గన్నవరం నియోజకవర్గంలోనూ పార్టీ బలోపేతానికి అవకాశం ఉంటుందని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఇక గన్నవరం నియోజకవర్గంలో కూడా వంశీ ని ఓడించే క్రమం లో ఇప్పటి నుంచే దృష్టి పెడితే అక్కడ పార్టీ కేడర్ లో కొత్త జోష్ వస్తుందని కూడా స్థానిక నేతలు చెపుతున్నారు. అయినా కూడా చంద్రబాబు గన్నవరం విషయంలో పెద్దగా కాన్ సంట్రేషన్ చేస్తున్నట్టు అయితే కనపడడం లేదు.