ఎంత శాంతమూర్తికైనా శత్రువు తప్పదన్నట్టుగా, దేశంలో ఇలాంటి విలువలు లేని వారి వలన భారత్ లాంటి దేశాలకు కూడా శత్రువులు పుట్టుకొస్తున్నారు. ఎంత తగ్గి జీవిస్తున్నప్పటికీ ఇంకా దేశద్రోహులను అడ్డుపెట్టుకొని కొన్ని వర్గాలు దేశంపై విరుచుకుపడుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కు అంతిమ అధికారం ఉన్నదనే విషయం గుర్తుకు వస్తుంది. ఆ అధికారం ఎవరికి ఇవ్వాలి అనే దానిపై పౌరులు కూడా దృష్టి పెట్టలేనట్టుగా దేశద్రోహుల వ్యూహాలు ఉంటున్నాయి. ఎంతసేపు వీళ్ళ రాజకీయాలు తప్ప రేపటికి దేశం ఏమైపోతుంది, తరువాత తరాలు ఎంత కష్టపడాల్సి వస్తుంది అనే ఆలోచన వాళ్ళు చేయబోవడం లేదు. ఇలాంటి వాళ్ళందరిని తప్పించుకొని ఒక్కడు ప్రజాస్వామ్య విలువలతో ఉండటానికి ప్రయత్నిస్తున్నా అది కుదరటం లేదు.
ఇలా పేరుకు తప్ప అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజలను పట్టించుకునే రాజకీయాలు ఎప్పుడో కనుమరుగయ్యాయి. కేవలం అధికారం కోసమే నేడు రాజకీయాలు తప్ప, ప్రజా సేవ కోసం కాదు అనేది స్పష్టం అవుతుంది. ఎక్కడో ఉన్న కొద్ది మంది నిజాయితీపరుల వంతు అసలు రాకముందే వాళ్ళు అధికారం కోల్పోతున్నారు. ఇలా ప్రజాస్వామ్యంలో అధికారం కోసం రాజకీయ వ్యూహాల మధ్య దేశం నలిగిపోతుంది. అందుకేనేమో బహుశా ఇన్నేళ్ళైనా అభివృద్ధి చెందుతూనే ఉంది. జనాభా ఉన్నప్పటికీ దేశాన్ని అభివృద్ధి చేయడానికి సరైన నాయకత్వం ఉంటె దశాబ్దం చాలనుకుంటాను. ఇందులో ప్రజల పాత్ర కూడా ఉండాలి, వాళ్ళు కూడా స్తబ్దుగా ఉండటం సమంజసం కాదు. ప్రజాస్వామ్యం అర్ధం తెలిసిన ఏ భారతీయుడు కూడా స్తబ్దుగా ఉండలేడు. ప్రజాస్వామ్యానికి వెన్నుముక ప్రజలే, వాళ్ళు నిరాశపడిపోతే దేశం కూడా నీరుగారిపోతుంది. అప్పుడే ఇలాంటి దొంగ నేతలు పుట్టుకొస్తారు.