కేవలం వారి స్వార్ధ ప్రయోజనాలకు ఎవరెవరికో ఆయా ప్రాజెక్టులు కట్టబెట్టి వాటి కోసం ఎందరెందరినో బాధపెట్టి, వాళ్ళవాళ్ళ సొంత ప్రాంతాల నుండి వాళ్ళను వెళ్లగొట్టి మరీ ఆయా కట్టడాలు చేపడతారు. కనీసం ఆ నిర్వాసితులను పట్టించుకునే వారు ఉండరు అనేది ఒక్క దేశంలో నే జరుగుతుంది కాబోలు. ఇలాంటి దేశంలో, అది కూడా కనీసం పిడుగులు పడతాయని ముందుగా తెలిపేంత సాంకేతికత ఉన్న చోట కూడా ప్రకృతి వైపరీత్యాల బారిన పడి ఇంకా జనాలు ఇక్కట్లు పడటం ఏమిటో అర్ధమే కాదు. ఒక్కసారైనా తగ్గట్టుగా ప్రజా స్పందన కూడా ఉండబోదు, ఇది మరీ విచిత్రం. ఈ దేశంలో జనాభా ఉన్నది కానీ ప్రజలు లేనట్టుగానే ఉంది. ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు కాసేపు మండిపోవడం తప్ప, మరోసారి గొంతెత్తి తప్పు చేసేవారిని దిద్దటం జరగని దేశంలో ఇంతకంటే సౌక్యమైన పరిస్థితులు కోరుకోవడం జరగనిపని.
రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారికి ఏదైనా విషయమే, తాజా వరదలు కూడా రాజకీయాలు చేస్తారు తప్ప, తమతమ పార్టీ సైన్యాన్ని ఘటన స్థలానికి పిలిపించి, ప్రజలకు సాయం అందించే యోచన మాత్రం ఎవరికీ రాదేమిటో..? ఆ అధికారి రాలేదు, ఈయన రాలేదు అని ఒకరికొకరు విమర్శించుకోవడం మానేసి, సమస్య ఉన్నచోట పరిష్కారంతో ఉండటం అలవాటైన లేదా అలా అలవాటు చేసుకున్న పార్టీలనే పార్టీలుగా గుర్తించే సంస్కారం ఈ ఎన్నికల సంఘానికి వస్తే బాగుండు. రేపటి రోజున దేశంలో నాణ్యత అనేది ఎక్కడా కూడా కనిపించబోదేమో..! ఇప్పటికే ఏది నకిలీ, ఏది నాణ్యత ఉన్నది అనేది కనుక్కోవడమే మహా కష్టంగా ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రజలు కారణం, ప్రజల నిర్లక్ష్యం స్వార్ధ రాజకీయాలను పెంచిపోషిస్తుంది తప్ప, జాలిపడి ప్రజా సేవ చేపించబోదు, ఇది ప్రజలు గుర్తించుకుంటే దేశం బాగుపడుతుంది.