అయితే ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో వెలుగుచూసిన కొవిడ్ కొత్త వేరియంట్ B.1.1.529 ఇప్పుడు కొత్త భయాలు కలిగిస్తోంది. అందుకే ఈ కొత్త వేరియంట్ B.1.1.529పై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. ఇది దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రత్యేకించి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.
విదేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు కచ్చితంగా చేయాలని కేంద్రం సూచించింది. ప్రత్యేకించి దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చే వారిపట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చింది. ఫారిన్ నుంచి వచ్చే ప్రయాణికుల్లో కొవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయితే వెంటనే వారి శాంపిల్స్ని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లకు పంపాలని కేంద్రం చెబుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కాంటాక్ట్లను కూడా ట్రాక్ చేయాలని సూచిస్తోంది. ఆ వివరాలు ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖకు అందించాలని చెబుతోంది.
కరోనా తగ్గుముఖం పట్టిందని వీసా పరిమితులు తగ్గించాం. అంతర్జాతీయ ప్రయాణంపై ఆంక్షలు సడలించాం. ఈ నేపథ్యంలో ఈ వేరియంట్ వ్యాప్తికి అవకాశం ఉంది. అందుకే రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. దక్షిణాఫ్రికాతో పాటు దానికి పొరుగున ఉన్న బోత్సువానాలో ఈ కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఈ కొత్త వేరియంట్కు సంబంధించి ఇప్పటికే 22 కేసులను గుర్తించింది దక్షిణాఫ్రికా.