ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ద్రోహి, రైతు ద్రోహి అని రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రెండవసారి సీఎం అయ్యాక రాష్ట్రంలో వేలాది మంది రైతులు చనిపోయినా వారిని కనీసం ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు అన్నారు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు మాత్రం రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారని, ఇదేమి న్యాయం అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ఏమి తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి రైతులకు ద్రోహం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామానే అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమాజానికి బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి.. ఈ యాత్రలతో అయ్యేది లేదు, పొయ్యేది లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడని తెలిపారు. కల్లాల్లో ధాన్యం కొనకుండా ఢీల్లీలో యాసంగి పంటపై డ్రామాలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. తడిచిన ధాన్యం కొనే అంశంపై కేసీఆర్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు రేవంత్రెడ్డి.
కొనుగోలులో జరుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలస్యం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి కర్షకులు నష్టపోతున్నారని మండిపడ్డారు. రైతుల ఒత్తిడితోనే వ్యవసాయ చట్టాలపై కేసీఆర్ యూటర్న్ తీసుకున్నాడని ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనాలని ఒత్తిడి చేయబోమని కేసీఆర్ కేంద్రానికి ఇచ్చిన లేఖనే నేడు వరి రైతుల పాలిట ఉరితాడు అయిందని విమర్శించారు. కల్లాల్లోకి కాంగ్రెస్ పర్యటనలో రైతుల ఆవేదనే తాను మాట్లాడుతున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ తెలంగాణ రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు రేవంత్రెడ్డి. తానే స్వయంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానని రేవంత్ మాట ఇచ్చారు.