ఏపీ ఆర్థికంగా కష్టాల్లో ఉంది.. ఈ విషయాన్ని అధికార పార్టీ కూడా ఒప్పుకుంటోంది. అందుకే ఉద్యోగులకు సైతం జీతాలు ఆలస్యంగా అందుతున్నాయి. ఏ నెలకు ఆ నెల కటకటా అన్నట్టుంది ఏపీ ఆర్థిక పరిస్థితి. జగన్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు.. ఆ ప్రభుత్వానికి భారంగా పరిణమించాయని విశ్లేషకులు చెబుతుంటారు. కానీ.. జగన్‌ను గెలిపించినవే ఆ పథకాలు.. అందువల్ల వాటి విషయంలో జగన్ వెనక్కి తగ్గే అవకాశమే లేదు.


దీనికి తగ్గట్టుగానే జగన్ సర్కారుపై విపక్షాల విమర్శలు కూడా జోరందుకున్నాయి. జగన్ కేవలం పంచుడు పథకాలపైనే ఆధారపడ్డారని.. ఏపీలో అభివృద్ధి ఆగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. జగన్ పాలనలో ఆంధ్రా పదేళ్లు వెనక్కిపోయిందని విమర్శిస్తున్నారు. అయితే.. ఇలాంటి విమర్శలకు చెక్ పడేలా ఇప్పుడు ఓ నివేదిక వచ్చింది. ఈ నివేదిక చూస్తే.. ఏపీ సీఎం జగన్ గాల్లో తేలిపోవడం ఖాయం. అందులోనూ ఈ నివేదిక ఇచ్చింది నీతి ఆయోగ్.. అంటే సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ. అందువల్ల ఈ నివేదికకు వాలిడిటీ ఎక్కువ.


ఇంతకీ ఈ నివేదిక ఏం చెప్పిందంటారా.. ఈ నివేదిక ప్రకారం దేశంలోనే అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ముందంజలో ఉంది. పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీకి 20 వ స్థానం దక్కింది. ఇక అన్నింటికంటే కేరళలో అతి తక్కువగా పేదరికం ఉంది. కేరళ జనాభాలో కేవలం 0.71 శాతం మంది మాత్రమే పేదలు అని నీతి ఆయోగ్ చెబుతుంది. ఆ తర్వాత గోవాలో తక్కువగా  3.76 శాతం, సిక్కింలో 3.82 శాతం, తమిళనాడులో 4.89 శాతం పేదలు ఉన్నారు. అదే పంజాబ్‌ అయితే.. 5.59 శాతం మంది మాత్రమే పేదలు ఉన్నారు.


తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో 13.74 శాతం మంది పేదవారు ఉండగా... ఏపీలో  12.31 శాతం మంది పేదలు ఉన్నారు. పేదరికపు రాష్ట్రాల జాబితాలో తెలంగాణది 18 వస్థానం కాగా.. ఏపీది 20వ స్థానం. అంటే.. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ యే  కాస్త మెరుగైన స్థానంలో ఉందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: