ఆంధ్రావని రాజకీయాలపై అనేక విమర్శలు రేగుతున్నాయి. ప్రతి విమర్శలు తీవ్రం అవుతున్నాయి. రేపటి వేళ జగన్ ముందస్తుకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణలో అయితే ఆ సంకేతాలు లేవు కానీ ఇప్పుడున్న చోట ఇప్పుడున్న స్థితిలో అనుకున్న ఫలితాలు అందుకోవడం అన్నది అసాధ్యం కావొచ్చు. వైసీపీ ముందు నుంచి సంక్షేమానికే ఓటేస్తూ వచ్చింది.
సంక్షేమ సారథిగా తనను పిలవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అభిలాష కూడా! ఈ క్రమంలో పూర్తిగా అభివృద్ధి అన్న పదాన్ని ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి కూడా! అందుకే జగన్ మొదట నుంచి తాను నమ్ముకున్న వలంటీరు వ్యవస్థను డెవలప్ చేస్తూ వస్తున్నారు. వారిని తన సొంత మనుషులు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. జీతాలు పెంచలేకపోయినా వారిని సంతృప్త పరిచేందుకు మధ్య సన్మానాలు సత్కారాలు చేయిస్తూ వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందిస్తూ, అసంతృప్తి పోయేలా చేస్తున్నారు. అంతేకాదు గ్రామ సచివాలయ వ్యవస్థను సైతం బాగా బలోపేతం చేస్తున్నారు. గ్రామ సచివాలయ కార్యదర్శులకు ఇప్పటికే కొన్ని అదనపు అధికారాలు ఇవ్వాలని కూడా చూస్తున్నారు. అయితే ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తాయా లేదా అన్నది ఇప్పుడిక ఆసక్తిదాయకం.
ఇక ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ అన్నది కూడా గ్రామ సచివాలయాల పరిధిలోకి తీసుకునిరావాలని కూడా యోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులతో గ్రామ సచివాలయ సిబ్బంది లెక్కకు మిక్కిలి ఒత్తిడి మోస్తున్నారు. ఇదే తరుణాన కొన్ని రాజకీయ తలనొప్పులూ వారిని వేధిస్తున్నాయి. వీటికి తోడు కొత్త బాధ్యతల కారణంగా సచివాలయ సిబ్బంది ఏ విధంగా పనిచేయనున్నారన్న సందేహాలు కొన్ని ఇప్పటికే నెలకొని ఉన్నాయి. మరోవైపు క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం అన్నది లేకుండా పోయింది. సీనియర్లంతా పదవుల కొట్లాటలకే పరిమితం అయిపోతున్న ప్రస్తుత తరుణంలో అసందర్భ వ్యాఖ్యలు దూషణలు అన్నవి వైసీపీని కలిచి వేస్తున్నాయి. అయినా కూడా శ్రేణులు పార్టీ నాయకత్వంపై కన్నా తమకు అప్పగించిన పనులపై పూర్తి బాధ్యత వహిస్తే కాస్తయినా ఫలితాలు వస్తాయి. ఈసారి అలాంటివేవీ జరిగే ఛాన్స్ అయితే లేదు. కనుక క్షేత్ర స్థాయిలో కార్యకర్తలంతా కలిసి పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఏ మేరకు శ్రమిస్తారో మరి!