ఏపీలో జగన్ పాలన అంతా అప్పులమయం అన్న ఆరోపణలు కొన్నినెలలుగా వినిపిస్తున్నాయి. అయితే.. తాజాగా కాగ్ నివేదిక వెల్లడించిన కొన్ని విషయాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. జగన్ ప్రభుత్వం అప్పల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ అంశంపై విపక్షాలు విమర్శల దాడి ప్రారంభించాయి. జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం లేదా అస్తవ్యస్తం అంటున్నారు..కానీ జరిగింది ఆర్థిక అణు విస్ఫోటనం అని విమర్శిస్తోంది బీజేపీ.


జగన్ ప్రభుత్వం తప్పిన ఆర్థిక క్రమశిక్షణ ప్రభావం శిక్ష భవిష్యత్తు తరాల మీద మోయలేని భారం పడనుందని.. రాబోయే 7 సంవత్సరాలలో రాష్ట్రం 1.10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చాల్సి ఉందని..  ప్రస్తుతం వడ్డీ కట్టడానికి అదనపు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని... బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూ లోటు 2020-21 నాటికి సున్నకి వచ్చే పరిస్థితి నుంచి.. ఇప్పుడు 36 వేల కోట్ల రెవెన్యూ లోటు కు తెచ్చి రాష్ట్రానికి జగన్ గుండు సున్న కొట్టారని లంకా దినకర్ అన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ పాలసీ క్రింద 5,600 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని.. ఇప్పటికే 1 లక్ష కోట్ల రూపాయల దాటి మరో 1 లక్ష కోట్ల పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీల శాతం 90% నుండి 180%  పెంచి గోల్ మాల్ గోవిందంలా రాష్ట్రంలో పాలన సాగుతోందని మండిపడుతోంది. కాసుల కోసం కార్పోరేషన్ల ద్వారా కల్పిత ఆదాయంతో లక్షల కోట్ల రూపాయల రుణాలు సేకరిస్తున్న జగన్ ప్రభుత్వం.. లక్షణంగా పాలన చేయమని ప్రజలు అవకాశం ఇస్తే, లక్షల కోట్ల రూపాయల అప్పులను ఆదాయం సృష్టించే ఆస్తుల కల్పన లేకుండా వృదా వ్యయంతో వనరుల నిర్వీర్యం జరుగుతుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎక్కడైనా ప్రభుత్వ పాలన తీరు వికాసం వైపు నడవాలని.. కాని ఏపీ రాష్ట్రంలో విధ్వంసం, విస్ఫోటనం వైపు ప్రయాణం సాగుతుందని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: