ప్రతిపక్షం చేస్తున్న
విమర్శలు వింటున్న అధికార పార్టీ నాయకులంతా
తమని తాము ప్రశ్నించుకోవాలి
ఆ తరహా రాజకీయం కారణంగా
మంచి పనులు జరగవన్న
విషయం ఎవరికి వారు తెలుసుకుంటే చాలు...
నాయకులంతా! కలిసి ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని ఉన్నంతలో వాటిని పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఆంధ్రావనిలో ఎన్నికల సమయంలో చేసిన హడావుడి, ఇచ్చిన హామీ అన్నవి తరువాత మరిచిపోకుండా పనిచేయడం కూడా ఓ అసాధ్యతే!
పాదయాత్ర చేసినా అంతకుముందు ఓదార్పు యాత్ర చేసినా పార్టీని నిలబెట్టేందుకు షర్మిల కానీ జగన్ కానీ విజయమ్మ కానీ మంచి కృషి చేశారు. ఎంతగానో కృషి చేశారు. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ వైఎస్సార్ బొమ్మతో గెలిచిన వారెందరో ఉన్నారు. సీఎం జగన్ కూడా పదవుల కన్నా చేసే 4 మంచి పనుల కారణంగా సమాజంలో కాస్తయినా గుర్తింపు వస్తుందన్న ఆలోచన ఒకటి తరుచూ తన కన్నా దిగువ ఉన్న వారికి వివరిస్తున్నారు. కానీ కొందరు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. అదేవిధంగా పార్టీని బతికించే పనులు చెయ్యండి...అని జగన్ చెప్పినా విమర్శించే వారికి పని కల్పించే విధంగానే ఎమ్మెల్యేలూ, ఎంపీలూ వ్యవహరిస్తున్నారన్న అభియోగాలు పుష్కలంగా ఉన్నాయి. అకాల వానలకు పంటలు పోయి కొందరు, నిద్రలేమి, ఆందోళనతో కొందరు అవస్థ పడుతున్నప్పటికీ పట్టెడన్న దొరకక సమస్యలు చవి చూస్తున్నారు.
అకాల వర్షాలు రైతుల జీవితాలను కకావికలం చేశాయి. ప్రకృతి కోపానికి చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. మొండి గోడలే మిగిలాయి. కొన్ని చోట్ల అది కూడా లేదు. చాలా మట్టి ఇళ్లే కాదు పెద్ద పెద్ద భవంతులు కూడా నీటి ఉద్ధృతికి నిలబడ లేకపోయాయి. ఈ తరుణంలో చాలా మంది నిరాశ్రయులయ్యారు. 95 వేల మంది కుటుంబాలకు ప్రమాదం పొంచి ఉంది. అయినప్పటికీ ఏపీ మంత్రులు జగన్ ఆదేశాలను పట్టించుకోవడం లేదు అన్న వాదన కూడా వినిపిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలలో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో వర్షాల ప్రభావం ఎలా ఉండబోతోంది.? ఏం చేస్తే బాగుంటుంది అన్న కోవలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు పలు సూచనలు చేశారు.
ఇదే సమయంలో ఇళ్లు కూలినవారిని ఆదుకోవాలని, ముఖ్యంగా బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని జగన్ చెప్పారు. వరదల కారణంగా నీటి ఊటలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లు అస్తవ్యస్తం అయి ఉన్నాయి. డ్రైనేజీ లు కూడా అలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలు కదిపి బయటకు వెళ్లి పనులు చేయించాల్సిన మంత్రులు మాత్రం ఇళ్లకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.