బొత్స లాంటి సీనియర్లు, ధర్మాన లాంటి సీనియర్లు, పెద్ది రెడ్డి లాంటి సీనియర్లు ఏ క్షణాన అయినా తనపై తిరుగుబాటు చేయవచ్చన్న అంచనాలో కానీ అపోహలో కానీ లేదా ముందు జాగ్రత్తలో కానీ జగన్ ఉన్నారనే అనుకోవాలి. అందుకే పార్టీ విషయమై కానీ ప్రభుత్వ విషయమై కానీ అధికారం అన్నది తన చేదాటి పోకుంటా కట్టుదిట్టమయిన చర్యలన్నీ తీసుకుంటున్నారాయన. ఈ క్రమంలో సొంత మనుషులపై ప్రేమ కారణంగా పదవులు ఇచ్చినా అవన్నీ కూడా కేవలం పేరుకే అని ఎప్పుడో తేలిపోయింది. ఇదే సమయంలో కొందరు భజనపరుల ఆత్మ తృప్తి కూడా ముఖ్యమే కనుక కరణం ధర్మశ్రీ లాంటి వారినో, విడుదల రజనీ లాంటి వారినో ప్రోత్సహించక తప్పదు.
ఇక వచ్చే ఎన్నికల సమయానికి సాక్షి పేపర్ ఎలా ఉన్నా ఆ పేపర్ చైర్మన్ భారతి మాత్రం పొలిటికల్ ఫీల్డ్ లోకి రానున్నారు. వీలుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలనూ కొట్టిపారేయలేం. అదేవిధంగా ఆమె అత్తమ్మ విజయమ్మ కూడా మళ్లీ ఇటుగా రావొచ్చు. భారతికి అన్ని ప్రాంతాలపై అవగాహన ఉంది. సాక్షి పత్రిక వ్యవహారాలు చక్కదిద్దేటప్పుడు, జగన్ జైల్లో ఉన్నప్పుడు అటు పార్టీనీ, ఇటు పేపర్ నూ చక్కగానే డీల్ చేశారు. దీంతో ఆమెపై ఇప్పటికీ చాలా మందికి మంచి అభిప్రాయం, గౌరవం ఉంది. కొన్ని నిర్ణయాలు జగన్ కన్నా మెచ్యూర్డ్ ప్యాట్రన్లోనే ఉంటాయి అని కూడా అంటుంటారు. విమెన్ సక్సెస్ అయితే తాను ఎంతో ఆనందిస్తానని కూడా అంటుంటారు. కనుక భారతి నేతృత్వంలో ప్రచారం చేయడం కానీ పాదయాత్ర చేయడం కానీ కొన్ని ప్రాంతాలలో అయినా జగన్ కు మద్దతుగా ఎన్నికల సభల్లో మాట్లాడడం కానీ చేయొచ్చు అన్నది ఓ ఊహ. ఎందుకంటే ఎలానూ చంద్రబాబు భార్య భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి రానున్నారని తెలుస్తోంది కనుక అదే రీతిలో భారతి కూడా ప్రజా క్షేత్రాన అడుగులు వేయడం ఖాయమని తేలిపోనుంది త్వరలో!