ఆర్ఆర్ఆర్ కు ఆల్ ద బెస్ట్
అని చెప్పారు బాలయ్య
బీమ్లా నాయక్ కు ఆల్ ద బెస్ట్
చెప్పారు బోయపాటి శ్రీను
పెద్ద హీరోలు పెద్ద పెద్ద ఇగోలతో ఉంటూ ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి అన్న మాట వాస్తవమే! కరోనా కారణంతో అలాంటివన్నీ చెరిగిపోయే రోజులు వచ్చేశాయి. మారుతున్న పరిణామాల కారణంగా ఇవాళ సినిమా నిలదొక్కుకోవడం అన్నది మాటల్లో చెప్పలేనంత కష్టం. ఒకప్పటిలా సినిమా నచ్చిన విధంగా నచ్చిన బడ్జెట్ లో తీసేయొచ్చు అని అనుకునేందుకు వీలేలేదు. థియేటర్లలో ఓ సినిమా జీవితం నిజంగానే మూడు రోజులు. అందుకే బాలయ్య మొదలుకుని అల్లు అర్జున్ వరకూ సినిమా బతకాలి.. సినిమా గెలవాలి అని కోరుకుంటున్నది. ఎన్ని ఓటీటీలు ఉన్నా థియేటర్ ఇచ్చే ఎక్స్పీరియెన్స్ వేరు కదా! అందుకే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్న మాటొకటి ఇప్పుడు అందరి నోట నుంచి వినవస్తోంది. లాక్డౌన్ తీసుకువచ్చిన మార్పు ఇది. కరోనా అనే మహమ్మారి తీసుకువచ్చిన మార్పు ఇది. ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగా వచ్చిన మార్పులివి. దీంతో అఖండ సినిమా ఫలితం ముడిపడి ఉంది. లేదా మరో సినిమా ఫలితం నిర్ణయమై ఉంది. ఇదివరకటిలా వంద రోజులు సినిమా అన్నది లేనేలేదు. అందుకే సినిమా బాగుంటే పరిశ్రమ బాగుంటుంది. పరిశ్రమ బాగుంటే కార్మికులు బాగుంటారు. కార్మికులు బాగుంటేనే హీరోలు బాగుంటారు. హీరోలు బాగుంటేనే వారిని నమ్ముకున్న నిర్మాతలు బాగుంటారు. నిర్మాతలు బాగుంటే చిత్ర పరిశ్రమ అన్నది కళకళలాడుతుంది.
పెద్ద హీరోలూ పెద్ద సినిమాలు, చిన్న హీరోలూ చిన్న సినిమాలు అనే భేదంతో నడిచిన ఇండస్ట్రీలో ఓ గొప్ప మార్పు. ఇప్పటిదాకా ఉన్న పద్ధతులు కానీ ఇంతవరకూ పాటించిన కొన్ని ఆంక్షలు కానీ ఇవాళ లేకుండా పోయాయి. నేను గెలవాలి కాదు సినిమా గెలవాలి అన్న నినాదంతో ఇవాళ సినిమా పరిశ్రమ ముందుకు వెళ్తోందని డైరెక్టర్ బోయపాటి శ్రీను అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చారు.
బాలయ్య అఖండ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కారణంగా చాలా మంచి పరిణామాలే చోటు చేసుకున్నాయి. మీ ప్రేమ కోసం మీ అభిమానం కోసం జై బాలయ్య అంటాను అని అల్లు అర్జున్ అన్నారు. అదేవిధంగా సినిమాకు సంబంధించి అంతా ఒక్కటై పనిచేయాల్సిన తరుణం వచ్చేసిందని కూడా ఈ వేడుక స్పష్టమయిన సంకేతాలు ఇచ్చింది. ఇకపై ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్ చేయాల్సిందే! ఒకరి సినిమా సక్సెస్ ను మొత్తం ఇండస్ట్రీనే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే!