ఈ చైనాలో ఏది జరిగినా ప్రపంచం ప్రభావితం అవుతుంది. అతిపెద్ద ఓడరేవు ఉన్న చైనా లో గత కొన్నాళ్లుగా వాణిజ్య నౌకల జాడ కనిపించకుండాపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికే కరోనా గందరగోళంలో ఉండటం తో, ఈ ఓడల సమాచారం అందుబాటులో లేకపోవడం, క్వారంటైన్ నిబంధనలు, కంటైనర్ ల కొరత లాంటివి పెద్ద సమస్యగా మారింది. వీటన్నిటి వలన సరుకు రవాణాకు కూడా తీవ్రంగా సమస్య ఎదురవుతుంది. సముద్రంలో ఒక నౌక ప్రయాణిస్తుంటే దానిని గుర్తించే ఆటోమేటిక్ టెక్నాలజీ ఉంటుంది. దాని ద్వారా ఆ ఓడ ఎక్కడ ఉంది, ఎంత వేగంతో వెళుతుంది, ఏ దిశగా వెళ్తుంది అనే వివరాలు తెలుసుకుంటారు. తద్వారా ఆయా స్టేషన్ లకు ఓడలు సమాచారం ఇస్తుంటాయి, అలాగే ఏదైనా సమాచారం ఆయా ఓడరేవుల నుండి ఆయా ఓడలకు చేరవేస్తారు. ఒకవేళ దూరం ఎక్కువగా ఉన్నట్టయితే సాటిలైట్ ద్వారా కూడా ఈ సమాచారం ఇరువురుకు చేరవేయబడుతుంది.
ఇంత పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నప్పటికీ, చైనా ఓడలు కనిపించకుండా పోతుండటం వెనుక అనేక అనుమానాలు వస్తున్నాయి. గత నెల నుండి ఈ సమస్య ఉన్నట్టు తెలుస్తుంది. విదేశీయులు తమ నౌకల విషయాన్ని తెలుసుకుంటున్నారనే అనుమానంతో చైనా గుట్టుగా ఇలా చేస్తుందా లేక తాజాగా ఆ దేశంలో తెచ్చిన సమాచార గోప్యత కింద ఈ ఓడలను ఇతర దేశాలు పసిగట్టకుండా కొత్త టెక్నాలజీ వాడుతోందా అనేది అందరి ప్రశ్న. దాదాపు 90 శాతం ఓడల పరిస్థితి ఇదే కావడంతో మరోసారి చైనా ప్రపంచానికి ఏ ఉపద్రవం తెస్తుందో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై చైనా ను ప్రశ్నించగా, తమ ఓడరేవులు సక్రమంగానే పనిచేస్తున్నాయని చెపుతుంది. కానీ సమాచారం మాత్రం అంతర్జాతీయ సమాజానికి తెలియడం లేదు. ఇప్పుడు ఇదో పెద్ద సందేహం అయి కూర్చుంది.