ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమ్రికాన్ కరోనా వేరియంట్‌పై ఇప్పుడు అంతా అలర్ట్ అవుతున్నారు. తమ దేశంలోకి ఈ డేంజరస్ వేరియంట్ రాకుండా అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ మన దేశంలో ఒక్క ఒమ్రికాన్ కేసు కూడా నమోదుకాక పోయినా.. ఈ డేంజరస్ వైరస్ ఇండియాకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తీవ్రతపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది.


ప్రత్యేకించి విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికీ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యంగా ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వారి పట్ల మరింత అలర్ట్‌గా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.  ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారి నుంచి సేకరించిన నమూనాలను వెంటనే  జీనోమ్‌ సిక్వెన్సింగ్‌కు పంపాలని కేంద్రం ఆదేశించింది. అంతే కాదు.. ఇండియాలోనూ ఇటీవల బాగా కేసులు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్రం ఆదేశించింది. హాట్‌స్పాట్‌ కేంద్రాల్లో అధికారుల నిఘా మరింత విస్తృతంగా కొనసాగాలని కేంద్రం పేర్కొంది.


వేగంగా పలు దేశాలకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరిస్తున్న సమయంలో అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణాలపై కేంద్రం నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. మళ్లీ ఎప్పుడు ప్రారంభించేదీ తర్వాత చెబుతామని ప్రకటించింది. కొత్త వేరియంట్‌ కలవరంపై రాష్ట్రాలు, కేంద్రపాలిక ప్రాంతాలకు కేంద్రం ఈ మేరకు  లేఖ రాసిది. కరోనా  వైరస్ నియంత్రణ కోసం మరింత విస్త్రతంగా సన్నద్ధమవ్వాలని, కట్టడి చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కేంద్రం సూచిస్తోంది. ఒమిక్రాన్‌ ఆందోళనల నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కేంద్రం సూచిస్తోంది.


ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. విమాన ప్రమాణాల ద్వారానే ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుందనేది నిపుణులు చెబుతున్నమాట. మరో వైపు అసలు ఒమిక్రాన్ గురించి మనం మరీ ఎక్కువగా భయపడుతున్నామని చెప్పేవారూ లేకపోలేదు. కానీ కీడెంచి మేలెంచాలి కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: