తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఇవాళ తెల్లవారుజామున హఠాన్మరణం పొందారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖకు వెళ్లిన ఆయనకు తొలుత స్వల్ప నొప్పితో ఇబ్బంది పడడం.. ఆ తరువాత నొప్పి తీవ్రంగా అయి.. అది అకస్మాత్తుగా గుండెపోటుకు దారి తీసింది. అయితే
హుమాన్షు ప్రసాద్ కు ఫోన్ చేసారు. ఆయన అంబులెన్స్కు ఫోన్ చేస్తే అందుబాటులో లేదు. ఆ తరువాత హిమాన్స్ విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
అయితే డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టం కలుగుతుందని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. డాలర్ శేషాద్రి మరణం పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు. ముఖ్యంగా లక్షలాది మంది శ్రీవారి భక్తులకు ప్రీతిపాతుడని, నాకు ప్రాణ సమానుడు అని టీటీడీ మాజీ జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. గత 50 ఏండ్లుగా స్వామి వారికి సేవలందించిన మహానీయుడు శేషాద్రి మృతి దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. టీటీడీలో శేషాద్రి సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని పేర్కొన్నారు. శేషాద్రికి ముందు.. శేషాద్రి తరువాత అన్నవిధంగా టీటీడీ చరిత్ర లిఖించబడుతుందని శ్రీనివాసరాజు తెలిపారు. చివరి నిమిషం వరకు స్వామి సేవలోనే తరిస్తూనే పరమపదించాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు శేషాద్రి అని పేర్కొన్నారు.
శేషాద్రి మృతిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. డాలర్ శేషాద్రితో శారదా పీఠానికి సుదీర్ఘకాలం అనుభవం ఉందన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించిన ప్రతి ఒక్కరికీ డాలర్ శేషాద్రి సుపరిచితులు అని స్వరూపానందేంద్ర చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డాలర్ శేషాద్రి ఆప్యాయతను పొందారని.. ఆయన హఠాన్మరణం తన హృదయాన్ని కలచివేసిందని వెల్లడించారు. నిత్యం వెంకటేశ్వరస్వామి పాదాల చెంత జీవించారని, ఈ విషయంలో డాలర్ శేషాద్రి ఎంతో అదృష్టవంతుడు అని అభిప్రాయపడ్డారు. ఆయన ఆత్మ శాంతించాలని.. ఆయన సాక్షాత్తూ మహావిష్ణువు హృదయంలోకి చేరాలని ఆశిస్తున్నట్లు తెలిపారు పీఠాధిపతి స్వరూపానదేంద్ర స్వామి.
మరోవైపు డాలర్ శేషాద్రి ధన్యజీవి అని.. శేషాద్రి స్వామి ప్రత్యేక రీతిలో స్వామి వారికి సేవ చేసుకున్నారని.. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని మాజీ సీఎస్, మాజీ ఈవో టీటీడీ ఎల్.వీ. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇప్పటికే డాలర్ శేషాద్రి మృతదేహాన్ని అంబులెన్స్లో టీటీడీ సెక్యూరిటీ మధ్య తిరుపతికి తరలించారు. మంగళవారం గోవిందదామంలో శేషాద్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.