డబ్బులెన్ని వస్తున్నా ఏపీ సర్కారుకు చాలవు. ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ అప్పులకు పోతున్నాయి. కొత్త అప్పులు తెస్తే అవి పాత అప్పులు తీర్చేందుకే సరిపోతున్నాయి. ఈ క్రమంలో డబ్బులు ఎన్ని ఉన్నా కూడా అవి ఎటూ చాలడం లేదు. ఉన్న పళాన కష్ట కాలం నుంచి గట్టెక్కించే దారుల కోసం వెతుకుతున్నారు జగన్ అండ్ కో మనుషులు.. దీంతో ఎక్కడ ఏ మూల ఏ నిధి ఉన్నా తమ సంస్థకు బడ్వాడా చేయమని ఆదేశిస్తున్నారు. కొన్ని సార్లు అంగీకరించకపోతే బెదిరిస్తున్నారు కూడా!
ఎందుకంటే..
ఆంధ్రప్రదేశ్ సర్కారుకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. లక్ష కోట్ల రూపాయలను సంక్షేమానికి వెచ్చిస్తూ దేశంలోనే అగ్రగామీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ సర్కారుకు ఎక్కడ లేని డబ్బు చాలడం లేదు. నిధులు లేక అప్పులు రాక ఎప్పటికప్పుడు అవస్థ పడుతున్న ఏపీ సర్కారును గండం నుంచి గట్టెక్కించే నాథుడే లేడు. కేంద్రం కూడా నిధులు ఇచ్చేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇస్తున్న నిధులన్నీ ఉచిత పథకాలకు వెచ్చిస్తున్నారు కనుక!
జగన్ సర్కారుకు ఈ విషయమై చెప్పి చూసినా తగ్గడం లేదు కనుక! ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఉత్తర్వు ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంలో ఉన్న డబ్బులును ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బదిలీ చేయమని ఒత్తిడి తెస్తోంది. దీంతో ఏంచేయాలో పాలుపోక వర్శిటీ పాలకమండలి తర్జనభర్జన పడుతోంది. వర్శిటీకి చెందిన దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు తమ కార్పొరేషన్ కు బదిలీ చేయాలని ఇందుకు తాము 5.5శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తామని కూడా చెబుతోంది. అయితే దీనికి యూనివర్శిటీ అంగీకారం తెలపడం లేదు. డబ్బులన్నీ ఎలా బదిలీ చేస్తాం అని ప్రశ్నిస్తూ.. పాలక మండలి తల పట్టుకుంటోంది.