ముఖ్యంగా రైతులు, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేందుకు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. రైతుల మెడ మీద కత్తి పెట్టి.. ప్రతీ బోర్కు మీటర్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని వెల్లడించారు. విద్యుత్ సంస్కరణలపై మాట్లాడాలని ఇటీవల తనకు లేఖ కూడా వచ్చిందని చెప్పారు సీఎం. మీటర్లు పెట్టకుంటే రాష్ట్రానికి వచ్చే అప్పులను ఆపేస్తారంట..దాదాపు 16 గంటలే విద్యుత్ వాడుకోవాలని చెప్పడం సంస్కరణలు అవుతాయా అని ప్రశ్నించారు కేసీఆర్. సాగు రంగాన్ని తీసుకెళ్లి ముఖ్యంగా అంబానీ, ఆదానీ చేతిలో పెట్టాలని చూసారు. వాస్తవం గ్రహించిన ఉత్తరాది రైతులు ఉద్యమం చేసారని, రైతుల పోరాటం,ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చూసి సాగు చట్టాలను రద్దు చేసారని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్.
బీజేపీ వాట్సాప్ యూనివర్సీటీలో పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ దేశాన్ని అప్పుల పాలు చేసి, రైతులను మోసం చేస్తుందని వివరించారు. కిషన్రెడ్డి బహిరంగ చర్చకు వస్తావా అంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని, బీజేపీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుంది అని, 15 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఒక్కటైనా ఉందా..? బీజేపీ ఎక్కడ ఉంది అని మండిపడ్డారు
ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తుంటే దానిని నాశనం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ.80లక్షల కోట్ల వరకు అప్పులు చేసి ఏమి చేశారని ప్రశ్నించారు. గత రెండేండ్ల కాలంలో దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిందని, అధికారంలోకి వచ్చిన ఏడేండ్ల కాలంలో బీజేపీ చేసిన సంక్షేమం ఏమిటో చెప్పాలని.. రైతులు బాగుపడాలంటే బీజేపీని పారదోలాలి అని పేర్కొన్నారు కేసీఆర్.