సొంత ఇంటి దొంగలు కారణంగా తెలంగాణలో ధాన్యం కొనుగోలు అన్నది ఓ ప్రహసనంలా మారింది. పోలీసులకు ఇది ఒక సవాలుగా పరిణమించనుంది. ఓ వైపు ఏపీ నుంచి ధాన్యం సరిహద్దులు దాటి పోతుంటే, ఇక్కడి అధికారులు మాత్రం కళ్లప్పగించి చూస్తున్నారు. సివిల్ సప్లైస్ పేరిట ఇచ్చే బియ్యం ఏకంగా పోర్టులలో దేశం దాటిపోతుంటే మన అధికారులు మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారు. ఇవి కాకుండా తాజా మోసాలు ఇటు ఇరు రాష్ట్రాలకూ సవాలుగా పరిణమించనున్నాయి.
ఆంధ్రా, తెలంగాణ కు మధ్య సరికొత్త వివాదం ఒకటి రాజుకోనుంది. కొందరు ఆంధ్రా పెద్ద మనుషుల నిర్వాకం కారణంగా తెలంగాణ రైతు మళ్లీ మోసపోతున్నాడు లేదా దగాపడుతున్నాడు. ధాన్యం కొనుగోలు అన్నది ఇప్పటికే తెలంగాణ సర్కారుకో తలనొప్పి వ్యవహారంగా మారింది. ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసినా కూడా తరువాత రావాల్సిన స్థాయిలో కేంద్రం నుంచి ఆర్డర్ రావడం లేదు. దీంతో కేంద్రం తమ నుంచి ధాన్యం గింజలు కొనుగోలులో చాలా అభ్యంతరాలు వస్తున్నాయి. వీటిపై ప్రతిరోజూ కేసీఆర్ నానా రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. వీటికి తోడు పక్క రాష్ట్రం నుంచి ధాన్యం అక్రమ మార్గం అమ్ముడయిపోతుండడం తెలంగాణ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారనుంది.
ప్రస్తుతం ధాన్యం కొనుగోలుకు సంబంధించి అనేక రాద్ధాంతాలు జరుగుతున్నాయి. కేంద్రం తమ నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేసీఆర్ గగ్గోలు పెడుతుంటే,మరోవైపు సరిహద్దు నుంచి ధాన్యం వచ్చి తెలంగాణ కొనుగోలు కేంద్రాలలో అమ్ముడయిపోతుం డడం తాజా వివాదానికి ఓ కారణం. ఇక్కడి నుంచి అంటే ఏపీ నుంచి ధాన్యం తెలంగాణ కేంద్రాలకు తరలిపోతుండడంతో పోలీసులు అప్రమత్తమై సరిహద్దు దగ్గర అప్రమత్తం అయి, సంబంధిత ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న మత లబుల కారణంగా ధాన్యం ఆంధ్రా దాటి పోతోంది. ఈ విధంగా పొరుగు రాష్ట్రం చేరుకున్న ధాన్యం అక్కడ అడ్డ దారులలో అమ్ముడయి పోతోంది. దీంతో తెలంగాణ రైతులకు మళ్లీ అన్యాయమే జరుగుతోంది. దీనిపై పోలీసులు నిఘా పెంచారు.