ఇంకా చెప్పాలంటే...
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు వరుసగా వ్యాపార రంగాన్ని విస్తృతం చేసే పనిలో ఉన్నారు. ఈ సారి రాజాం కేంద్రంగా వ్యాపారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కృష్ణా మెడికల్ సెంటర్ పేరిట రాజాంలో వ్యాధి నిర్థారణ కేంద్రాన్ని ప్రారంభించారు. కరోనా సమయంలో రెండు మెడికల్ సెంటర్లు ప్రారంభించిన ధర్మాన కృష్ణ దాసు మరో వైద్య కేంద్రం ఏర్పాటుకు తక్కువ సమయంలోనే సిద్ధం అయ్యారు. ఓ వైపు రాజకీయం మరో వైపు వైద్య రంగం కేంద్రంగా వ్యాపారం ఇలా రెండు రంగాల్లోనూ ఆయన జోడెద్దుల బండిని బాగానే నడుపుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు దిద్దుకుంటున్నారు. త్వరలో పలాస కేంద్రంగా కృష్ణా మెడికల్ సెంటర్
(డయగ్నోసిస్ సెంటర్) ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. వీటి నిర్వహణను కూడా ఆయన చిన్న కుమారుడు, రేడియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య చూస్తున్నారు.