2018 - 19 కు రెవెన్యూ లోటు 12.12 శాతం కాగా, 2019- 20 నాటికి రెవెన్యూ లోటు 23.81శాతంగా ఉంది. రెవెన్యూ లోటు ఎంతగా పెరుగుతున్నా ప్రభుత్వ పథకాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఆస్తులు పెంపుదలపై ఏపీ ప్రభుత్వానికి శ్రద్ధే లేదని తేల్చేసింది కాగ్. రెవెన్యూ లోటు ఆందోళనకరంగా ఉన్నా దానిని నియంత్రించేందుకు జగన్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏవీ పెద్దగా ఫలించడం లేదు.
ఏం చేసయినా సరే ముందుగా నిర్ణయించిన సంక్షేమ పథకాలు ఆగేందుకు వీల్లేదని సీఎం ఆలోచన. ఆలోచన బాగున్నా స్థాయికి మించిన పథకాలు ప్రవేశ పెట్టి ఆర్థిక లోటు ను తీవ్రంగా పెంచేస్తున్న వైనంపై జనం ఎవ్వరూ పెదవి విప్పడం లేదు. తాత్కాలికంగా అందుతున్న ఆర్థిక ప్రయోజనాలే తమకు ముఖ్యం అన్న రీతిలో ప్రజలు ఉంటున్నారు. దీంతో నెలకో పథకం ప్రకటించి ఆర్థిక పరిస్థితి సహకరించినా సహకరించకపోయినా జగన్ మాత్రం డబ్బులు పంచుకుంటూ పోతున్నారు. వాస్తవానికి రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం ముందుకు వచ్చి నిధులు ఇచ్చినా కూడా రాష్ట్రం మాత్రం అందుకు అనుగుణంగా పనిచేయడం లేదు అని కాగ్ చెబుతోంది. ఆస్తులు కరిగించి అప్పులు మిగిలించడమే ఇప్పటి ప్రభుత్వ ధ్యేయంగా పాలన సాగుతోంది.
ఆంధ్రావనిలో అభివృద్ధి సంబంధ విషయాలూ వాటి పర్యవసానాలూ అన్నీ అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. అప్పులు తీసుకువచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్న వైనంపై ఇప్పటికే విమర్శలున్నాయి. కానీ జగన్ కు మాత్రం సంక్షేమ పథకాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి పనుల నిర్వహణపై లేదన్న మాట ఒకటి టీడీపీ వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ చిన్న చిన్న పనులు కూడా చేపట్టలేకపోతోంది. రోడ్ల మరమ్మతుల విషయమై కానీ లేదా చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలకు నిధులు విడుదల చేయడంలో కానీ ఎటువంటి చొరవా చూపడం లేదు. అప్పులు ఎన్ని ఉన్నా అందుకు తగ్గ పురోగతి అభివృద్ధిలో మాత్రం లేదు అన్నది ఓ వాస్తవం.