ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సభ్య దేశాలకు అప్రమత్తత లేఖలు జారీ చేసింది. ఇది ప్రపంచమంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను కలిసికట్టుగా పోరాడేందుకు సభ్య దేశాలు ఓ ఒప్పందం చేసుకోవాలని సూచించింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టీకాలు ఒమిక్రాన్ పై చాలా తక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని మోడెర్నా ఫార్మా సంస్థ తెలిపింది. వ్యాధికారక స్పైక్ ప్రోటీన్ పై అధిక సంఖ్యలో మ్యుటేషన్లు ఉండటమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. దీంతో వైరస్ వ్యాక్సిన్లకు లొంగకుండా తయారైందని మోడెర్నా సీఈఓ స్టెఫాన్ బ్యాలెన్స్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న కొవిడ్ టీకాలను వచ్చే ఏడాది నాటికి మ్యుటేషన్లకు అనుగుణంగా తయారు చేయాల్సి ఉందన్నారు.

ఇక నవంబర్ 21న దక్షిణాఫ్రికా నుంచి చండీగఢ్ కు వచ్చిన 39ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. సదరు వ్యక్తికి మళ్లీ నెగిటివ్ అని తేలినా.. అతనితో సన్నిహితంగా ఉన్న అతని భార్య, సహాయకుడికి తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అధికారులు వాళ్ల శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపించారు. సౌతాఫ్రికాలో ప్రమాదక ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన కారణంగా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

మరోవైపు ప్రజలను ఒమిక్రాన్ వైరస్ భయం వెంటాడుతోంది. కొత్త వేరియంట్ ఎటునుంచి వచ్చి పడుతుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సెకండ్ వేవ్ భయాలే వదిలిపోని దశలో.. చలికాలం ఒమిక్రాన్ ఇంకెంత విరుచుకుపడుతుందోనని వణికిపోతున్నారు. మరోవైపు చలితీవ్రత పెరగడం.. వింటర్ వైరస్ ల వ్యాప్తికి అనుకూలంగా కావడం గుబులు పుట్టిస్తోంది. సరైన జాగ్రత్తలు మాత్రమే మనల్ని కాపాడగలవని గుర్తు చేస్తోంది. కరోనా నిబంధలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.







మరింత సమాచారం తెలుసుకోండి: