మనసున్న మంచి పని ఒకటి
మన హీరోలు చేశారు
వరద బాధితులకు తమ అండ అందించారు
ఇప్పటికే చాలా సమస్యలతో నెట్టుకువస్తున్న
బాధిత ప్రజలకు ఈ పరిణామం ఓ ఉపశమనం
వరదలతో సతమతమవుతున్న సీమ జిల్లాలను ఆదుకునేందుకు అదేవిధంగా బాధిత ప్రాంతం అయిన నెల్లూరును ఆదుకునేందు కు చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చింది. గతంలో మాదిరిగానే తనవంతు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంది. ఇప్పుడు ఏ హీరో ఎంత ఇచ్చారు అన్న చర్చ అనవసరం కానీ ఉన్నంత తమ పెద్ద మనసు చాటుకున్నారు కదా! అదొక్కటీ చాలు. ప్రతి పరిణామా న్నీ వివాదం చేయాల్సిన పని లేదు. అలా అని ప్రతి పరిణామాన్నీ ఆకాశానికి ఎత్తేయాల్సిన పని కూడా లేదు. అయితే గతంలో కన్నా కాస్త ఆలస్యంగానే చిత్ర పరిశ్రమ స్పందించింది అన్నది మాత్రం వాస్తవం. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలు అయిన చిత్తూరు, కడప, అనంతపురంతో సహా నెల్లూరు కూడా అతలాకుతలం అయి ఉన్నాయి. ఇవాళ్టికీ ఆయా ప్రాంతాలు ఏవీ పూర్తిగా కోలుకోలేదు. ఇళ్లు లేక కొందరు..తింటి లేక కొందరు అవస్థ పడుతున్నారు. అలమటిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎంకు అండగా ఉండేందుకు చిత్ర సీమ ముందుకు వచ్చి, తమ బాధ్యతను నిర్వర్తించడం ఎంతైనా అభినందనీయం. ముఖ్యంగా వరదల ఉద్ధృతికి రహదారులు అస్తవ్యస్తం అయ్యాయి. ఇళ్లు కూలి పోయాయి. తిరుపతి లాంటి ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రకృతి విలయ తాండవానికి వ్యవస్థలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈ తరుణంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినా కూడా ఇంకా చేయాల్సిన పనులు, చేపట్టాల్సిన విధులు ఉండనే ఉన్నాయి. వానలు ఇంకా అక్కడక్కడ భారీగానే కురుస్తున్నాయి. ఇప్పటిదాకా ఇళ్లు కోల్పోయిన వారంతా నష్ట నివారణ చర్యలు ఏవని సీఎంను నిలదీస్తున్నారు. సీఎం జగన్ మాత్రం ఇళ్లు పోయిన వాళ్లందరికీ కొత్తవి కట్టిస్తామని, అందుకు తగ్గ ఆర్థిక సాయం చేస్తామని చెబుతున్నారు. కానీ అందుకు సంబంధించిన చర్యలు క్షేత్ర స్థాయిలో ప్రారంభం కాలేదు. అవన్నీ త్వరితగతిన ప్రారంభం అయితే కొంతలో కొంతయినా బాధితులకు ఉపశమనం దక్కుతుంది.