మోస పోయినవాళ్లంతా ఏడుస్తున్నారు
ఈ కథలో! దీంతో మోసం వెలుగు చూసినా
డబ్బు రికవరీ అవుతుందో లేదో అన్న టెన్షన్ బాధితులది!
ఇదంతా కిట్టీ పార్టీల పేరిట సినిమావాళ్లను టార్గెట్ గా చేసుకుని
ఆడుతున్న ఆట! తస్మాత్ జాగ్రత్త
హీరో మహేశ్ బాబు సోదరి మోసపోయారు. ఆఖరికి ఇంకొందరు కూడా ఉన్నదంతా పోగొట్టుకునే స్థితికి వచ్చేశారు. సిటీలో అత్యంత నమ్మకంగా మెలిగే మహిళలు కొందరు సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకుని చేస్తున్న వ్యాపారం లేదా చీకటి వ్యవహారం అన్నది ఇప్పుడొక తంతులా మారిపోయింది. దీంతో కొందరు డబ్బులు పోగొట్టుకుని, ప్రాణ రక్షణ లేక నానా అవస్థలూ పడుతున్నారు. ఈ సీన్ లో మోసగాళ్లు ఎవరు మోసగత్తెలు ఎవరు? అంతంత డబ్బును ఎలా ఫణంగా ఉంచి పేకాట ఆడుతున్నారని, ఎందుకు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని? అంటే డబ్బున్నోళ్లంతా ఇలాంటి వారి మాటలకే పడిపోతే కోట్లు వచ్చి వాలిపోతాయా?
గండిపేట సిగ్నేచర్ విల్లా ఎన్నో కథలకు చీకటి కథలకు ఆనవాలుగా అయింది. కేవలం డబ్బున్న మహిళలకు ఇదొక వ్యసనంగా మారింది. తొలుత ఇలాంటి వారిని నమ్మేందుకు ఇష్టపడని సినీ ప్రముఖులు తరువాత తరువాత మాయ మాటలకు పడిపోయి మంత్రముగ్ధులయిపోయి వారి కోట్ల రూపాయలు పొగొట్టుకుంటున్నారు. శిల్పా చౌదరి అనే ఆమె ఇలాంటి కోవలోనే తనంతట తాను సినిమావాళ్లతో పరిచయం పెంచుకుని వారిని ఇంప్రెస్ చేసింది. అక్కడి నుంచి వారితో తరుచూ మాట్లాడుతూ వీకెండ్ పార్టీలు ఎరేంజ్ చేసింది. భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ ది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి నమ్మబలికి ఎన్నో కుటుంబాలను ముంచింది. ఇప్పుడీ బాగోతం బయట పడడంతో జైల్లో ఊచలు లెక్కెడుతోంది.
ఇంకా చెప్పాలంటే..
డబ్బున్నోళ్లే అంతా! డబ్బున్నోళ్ల కథలే అన్నీ! అవును! సినిమా వాళ్లు, పేరున్న నాయకుల కుటుంబాలు ఇవన్నీ డబ్బున్న కుటుంబాలే కదా! అందుకే యథేచ్ఛగా మోసాలు జరుగుతున్నాయి. తాజాగా మహేశ్ బాబు సోదరి ఉదంతం కూడా ఇలాంటిదే ఆమె రెండు కోట్ల రూపాయలకు పైగా మోసపోయి శిల్పా చౌదరి అనే మహిళ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసలు కథ మొదలయింది. ముందుగా డబ్బున్న వారిని బుట్టలో వేసుకోవడంతో మొదలయ్యే కథ తరువాత ఎక్కడెక్కడికో వెళ్లిపోయాక ఆఖరికి వీరు మోసపోవడం అన్నది ఓ ఆనవాయితీగా మారిపోతోంది. ముందగా కిట్టీ పార్టీలకు ఆహ్వానించి ఆ తరువాత జూదం పేరిట వాళ్లను ప్రోత్సహించి అక్కడి నుంచి ఎన్నో మోసాలకు పాల్పడి చివరకు అసలు విషయం బయట పడేసరికి పోలీసుల వలకు చిక్కుతున్నారు. అయినప్పటికీ మోసాల తీరు మాత్రం మారడం లేదు.