ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల వివాదం మళ్లీ మొదటికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎయిడెడ్ విద్యా సంస్థల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఓ నిర్ణయం వెలువరించింది. ఎయిడెట్ సంస్థలను యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగించే విషయం రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. పలు చోట్ల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. చివరికి పోలీసుల లాఠీఛార్జ్‌లో విద్యార్థులు గాయపడ్డారంటూ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీనితో జగన్ సర్కార్ ఓ ప్రకటన కూడా చేసింది. ఎయిడెడ్ విద్యా సంస్థలను యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగించడం  అనేది పూర్తిగా వారి ఐచ్చికమని చెప్పేసింది. ఇందుకోసం నాలుగు ఆప్షన్లను కూడా సూచించింది జగన్ సర్కార్. మీకు నచ్చిన ఆప్షన్ మీరే ఎన్నుకోవాలని కూడా సూచించింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు మాత్రం తాజా ఆలోచనలతో మరోసారి ముందుకు వచ్చింది వైసీపీ ప్రభుత్వం.

రాష్ట్రంలో ఏకంగా 418 ఎయిడెడ్ పాఠశాలల అనుమతులను రద్దు చేసేందుకు తాజాగా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 40 మంది లోపు విద్యార్థులున్న విద్యా సంస్థలను మూసి వేసేందుకు విద్యా శాఖ ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే అన్ని పాఠశాలల నుంచి నివేదికలు పంపాలని లేఖలు రాసింది కూడా. రెండేళ్లుగా పిల్లల అడ్మీషన్లు భారీగా తగ్గడంతో పాటు... ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు అడ్మీషన్ కోసం అవకాశం కల్పించినా కూడా ప్రవేశాలు ఏ మాత్రం పెరగలేదు. దీంతో వీటిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాధికారులకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో మొత్తం 840 పాఠశాలల్లో పిల్లల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించారు. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఉన్న అడ్మిషన్లను పరిశీలిస్తే... ప్రవేశాలు పెంచడంలో 418 పాఠశాలలు పూర్తిగా విఫలమయ్యాయని విద్యా శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 133 పాఠశాలల్లో 40 మంది విద్యార్థులున్నారు. వీటిల్లోని కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే సిబ్బందిని ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు కూడా చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: